చంద్రబాబు వర్సెస్ విజయసాయిరెడ్డి: మండలి గ్యాలరీలోనే: ఎత్తులు..పై ఎత్తులు..!
మూడు రాజధానుల వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి ప్రతిష్ఠగా మారింది. శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి సూచనగా వెల్లడించిన మూడు రాజధానుల వ్యవహరం పైన ప్రతిపక్ష టీడీపీతో పాటుగా అమరావతి రైతులు సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు..బోస్టన్ కమిటీలు సైతం ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా నివేదికలు ఇచ్చాయి. వీటి పైన అధ్యయనం కోసం నియమించిన హైపవర్ కమిటీ సైతం అనుకూలంగా నివేదిక సమర్పించింది. వ్యూహాత్మకంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి..ప్రారంభ రోజున ఉదయం 9 గంటకు కేబినెట్ సమావేశంలో రెండు బిల్లులను ఆమోదించారు. ఆ వెంటనే శాసనసభలో ఈ బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదించేలా వ్యవహరించారు. ముందుజాగ్రత్తగా తీర్మానం సైతం ఆమోదించారు. అయితే, శాసనమండలిలో ప్రతిపక్ష బలం ఎక్కువగా ఉందని తెలిసినా.. ప్రభుత్వం ధీమాగా ముందుకెళ్లింది. అక్కడ తిరస్కరించినా..తిరిగి శాసనసభలో ప్రవేవ పెట్టి ఆమోదించే అవకాశం ఉందనేది వారి ధీమాకు కారణం. అయితే, అక్కడే ఊహంచని పరిణామాలు జరిగాయి. అంతే.. అటు వైసీపీ..ఇటు టీడీపీ అప్రమత్తమయ్యాయి. నేరుగా అగ్ర నేతలు రంగంలోకి దిగారు. వ్యూహ..ప్రతి వ్యూహాలతో మండలి సమావేశాల్లో రంజైన రాజకీయం చేసారు.
మండలిలో చంద్రబాబు పక్కా వ్యూహంతో..
శాసనసభలో తమకు బలం లేకపోవటంతో..మండలిలో ఉన్న బలాన్ని బిల్లు అడ్డుకొనేందుకు వినియోగించాలని చంద్రబాబు ముందుగానే సిద్దమయ్యారు. అందుకు యనమలకు బాధ్యతలు అప్పగించారు. మండలిలో అనుసరించే వ్యూహాలను మరెవరికీ తెలియనీయ లేదు. అదే సమయంలో కొందరు మండలి సభ్యులను సైతం వైసీపీ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తుందని చంద్రబాబు పసి గట్టారు. దీంతో.. మండలిలో ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించే ముందే యనమల రూల 71 మోషన్ ప్రతిపాదించారు. దీంతో..వైసీపీకి చంద్రబాబు ఏదో చేస్తున్నారనే విషయం అర్దమైంది. వెంటనే విజయ సాయిరెడ్డిని రంగం లోకి దింపారు. ఆయనతో పాటుగా టీడీపీ ఛైర్మన్ సైతం మండలికి చేరుకున్నారు. దీంతో టీడీపీ అధినేత తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. సభ జరుగుతున్నంత సేపు..వాయిదా పడినా.. తొలి రోజు రూల్ 71 పైన చర్చ ముగిసి..టీడీపీ తీర్మానం నెగ్గే వరకూ శాసనసభా ప్రాంగణంలోని తన ఛాంబర్ లోనే ఉన్నారు. సభలోని సభ్యులకు అవసరమైన సూచనలు పంపుతూ కనిపించారు.
గ్యాలరీలో సాయిరెడ్డి..చంద్రబాబు..
ఇక, తొలి రోజు రాత్రి జరిగిన రూల్ 71 ఓటింగ్ లో ఇద్దరు టీడీపీ సభ్యులు ప్రభుత్వం వైపు మొగ్గారు. టీడీపీ విప్ ను ఉల్లంఘించారు. దీంతో.. రెండో రోజు మరెవరూ చే జారకుండా టీడీపీ జాగ్రత్తలు తీసుకుంది. అయితే, రెండో రోజు సభ ప్రారంభం నుండి విజయ సాయిరెడ్డి గ్యాలరీలోనే ఉండి..సభను తిలకించారు. ఇక, సాయంత్రానికి మండలిలో చర్చ ముగిసింది. ప్రభుత్వం సమాధానం పూర్తయింది. వెంటనే టీడీపీ నుండి సెలెక్ట్ కమిటీ ప్రతిపాదన వచ్చింది. మంత్రులు అడ్డుపడ్డారు. సభలోనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసారు. దీంతో..చంద్రబాబు సైతం నేరుగా మండలి గ్యాలరీ కి చేరుకున్నారు. అచ్చెన్నాయుడు..బాలక్రిష్ట సైతం మండలి గ్యాలరీలోనే కూర్చున్నారు. సభ దాదాపు గంటన్నార సేపు వాయిదా పడింది. అయినా..వారు కదల్లేదు. చంద్రబాబు వద్ద ఉన్న సెల్ ఫోన్ సైతం మార్షల్స్ తీసేసుకున్నారు. ఇక, మండలి తిరిగి ప్రారంభమైన తరువాత గ్యాలరీలో ఒక చోట విజయ సాయిరెడ్డి.. మరో వైపు చంద్రబాబు తమ దూతల ద్వారా మండలిలోనే సభ్యులు సూచనలు అందించినట్లు రెండు పార్టీలు ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.
ఛైర్మన్ ను చంద్రబాబు ప్రభావితం చేసారు..
చంద్రబాబు నాయుడు గ్యాలరీలో వచ్చి అంతసేపు ఎలా కూర్చుంటారి మంత్రులు ప్రశ్నించారు. ఆయన అక్కడ కూర్చొని..నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయం వచ్చేలా ఛైర్మన్ పైన ఒత్తిడి తెచ్చారని మంత్రులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు వ్యవహార తీరు సరికాదంటూ మండిపడ్డారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం తమ వ్యూహం ఫలించటం పైన సంతోషంతో కనిపించారు. తాము అనుకున్న విధంగా మండలిలో తమ వ్యూహాలు ఫలించాయని సంతోషిస్తున్నారు. మండలి మొదలైన సమయం నుండి చివరకు సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపాలనే ఛైర్మన్ నిర్ణయం వరకు అటు విజయ సాయిరెడ్డి.. ఇటు చంద్ర బాబు పూర్తిగా తమ వ్యూహాలను అమలు చేసారు. చివరకు ఛైర్మన్ నిర్ణయం మాత్రం ప్రభుత్వానికి మింగుడ పడని అంశంగా మారింది.