అర్దరాత్రి చంద్రబాబు మంతనాలు: యనమల మీదే భారం: మండలిలో బలాబలాలు ఇలా..!
మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు చేసిన సమయం నుండి టీడీపీ ఆందోళనలు కొనసాగిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసారు. ఇక, అసెంబ్లీలోనూ తమ వైఖరి స్పష్టం చేసారు. అయితే, అసెంబ్లీలో అధికార పార్టీ బలం కారణంగా టీడీపీ అభ్యంతరాలకు విలువ లేకుండా పోయింది. అయితే, శాసన మండలిలో బిల్లు ను అడ్డుకుంటామని టీడీపీ ధీమాగా చెబుతోంది.
దీని పైన శాసనసభ ముగిసిన తరువాత చంద్రబాబు అర్ద్రరాత్రి వరకు మంతనాలు సాగించారు. సభలో వ్యూహాల బాధ్యతల యనమలకు అప్పగించారు. సభలో ఇతరులను కలుపుకు పోవాలని సూచించారు. ద్రవ్య బిల్లు కాకపోవటంతో టీడీపీకి దీనిని అడ్డుకొనే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వానికి ఉన్న అవకాశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో మండలిలో ఉన్న బలా బలాలు బిల్లుల ఆమోదానికి కీలకం కానున్నాయి.
అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు: మూడు రాజధానులపై మంత్రి బుగ్గన కీలక ప్రకటన
మండలిలో టీడీపీకే మెజార్టీ..
ఏపీ శాసన మండలి ముందుకు కాసేపట్లో అసెంబ్లీలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లుతో పాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లు రానున్నాయి. అయితే, టీడీపీ వీటిని అడ్డుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ సమయంలో మండలిలో పార్టీల వారీగా ఉన్న బలా బలాలు..సంఖ్యా బలం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీ మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉండగా..అందులో మూడు స్థానాలు ప్రస్తుతం ఖాళీ గా ఉన్నాయి. అందులో అధికంగా టీడీపీ కి 28 మంది సభ్యుల మెజార్టీ ఉంది. కాగా.. అధికార వైసీపీకి మాత్రం 9 మంది సభ్యులే ఉన్నారు. పీడీఎఫ్ సభ్యులు అయిదుగురు.. స్వతంత్రులు ముగ్గురు..ఉండగా బీజేపీ నుండి ఇద్దరు సభ్యులు మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, నామినేటెడ్ కోటాలో నియమితులైన ఎనిమిది మంది సభ్యుల్లో నలుగురు సభ్యులు టీడీపీకే మద్దతిచ్చే అవకాశం ఉంది. దీంతో.. బీజేపీ ఇద్దరు సభ్యులు బిల్లును వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది.
యనమలపైనే చంద్రబాబు భారం..
ఈ బిల్లును మండలిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని టీడీపీ..ఎలాగైనా ఆమోదించేలా చూడాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. అయితే, మండలిలో ప్రతిపక్షంగా తమకు ఉన్న అవకాశాలు.. బిల్లు విషయంలో వ్యవహరించాల్సిన వ్యూహాల పైన టీడీపీ అధినేత చంద్రబాబు అర్ద్రరాత్రి వరకు పార్టీ నేతలు..ఎమ్మెల్సీలతో మంతనాలు సాగించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. మండలిలో మొత్తం సభ్యులు హాజరవ్వాలని..పార్టీ నిర్ణయానికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలని పార్టీ విప్ జారీ చేసింది. ఇక, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాల బాధ్యతలను సీనియర్ నేత యనమలకు అప్పగించారు. ఆయన సీనియర్ సభ్యుడు కావటంతో పాటుగా గతంలో స్పీకర్ గా పని చేసిన అనుభవం..అదే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రిగా..న్యాయపర అంశాల పైన పట్టు ఉండటంతో ఆయన పాత్ర ఇప్పుడు సభలో టీడీపీ కీలకంగా భావిస్తోంది.
అటు మంత్రులు..ఇటు ప్రతిపక్షం
శాసనసభ కంటే భిన్నంగా మండలిలో పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకోవాలని పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాటానికి మంత్రుల ను మండలిలో మొహరిస్తున్నారు. ఇటు టీడీపీ ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయాలని భావిస్తోంది. దీని కారణంగా బిల్లు పెండింగ్ లో పడే అవకాశం ఉంటుంది.అయితే, సీఎం మాత్రం బిల్లు ఆమోదం..లేక తిరస్కరణ అయినా ఇదే రోజు పూర్తి చేయాలని మంత్రులకు నిర్దేశించారు. మండలిలో బిల్లు తిరస్కరణకు గురైనా..తిరిగి బుధవారం శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించేలా చూడాలని ప్రభుత్వం అంచనాగా కనిపిస్తోంది. దీంతో..మొత్తంగా శానసమండలిలో బిల్లు ప్రవేశ పెట్టిన సమయం నుండి సభ తుది నిర్ణయం వరకు మొత్తం వ్యవహారం ఉత్కంఠ భరితంగా మారింది.