చంద్రబాబు వార్నింగ్.. అగ్నిగుండమవుతుంది: స్పీకర్ స్థాయిని దిగజార్చొద్దు: 2014లో వైసీపీ ఓడిపోయి...!!
ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను కట్టడి చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. వైసీపీ శ్రేణుల ఆటలు సాగనీయమని ... అరాచకాలు కొనసాగితే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు జరిగాయన్నారు. 8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని వివరించారు. వైసీపీ అరాచకాలపై పోలీసులు అచేతనంగా మారారని చంద్రబాబు విమర్శించారు. వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వం ప్రజాధనం ఖర్చు చేస్తోందన్నారు. స్పీకర్ స్థాయిని దిగజార్చొద్దని చంద్రబాబు సూచించారు.
రాష్ట్రం అగ్నిగుండమవుతుంది..
జగన్ ప్రభుత్వం పైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి మనపైనే వాళ్లు కేసులు పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలకు ఎందుకు అంత గర్వమని అన్నారు. తాము మీలానే వ్యవహరించి ఉంటే మీరు ఉండేవాళ్లు కాదన్నారు. వ్యక్తిగత కక్షలు తీర్చుకోడం.. ఇష్టమొచ్చినట్లు దాడులు చేయడం.. తెలుగుదేశం పార్టీని భయభ్రాంతులకు గురిచేస్తే భయపడుతుందని వైసీపీ నేతలు అనుకుంటే పొరబాటని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను కట్టడి చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. వైసీపీ శ్రేణుల ఆటలు సగనీయమని చంద్రబాబు స్పష్టం చేసారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు కొనసాగిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
2014లో వైసీపీ ఓడిపోయినా..
2014లో వైసీపీ ఓడిపోయి.. ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేదా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం లేదని, ప్రజావేదిక కావాలని కోరితే తనపై కక్షతో కూలగొట్టారని ఆయన ఆరోపించారు. బెదిరిస్తే భయపడిపోతారన్న భ్రమలో వైసీపీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎదురుతిరిగిన నాడు వైసీపీ పారిపోయే పరిస్థితి వస్తుందన్నారు. పోలీసు వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎలా పనిచేసిందీ.. ఇప్పుడు ఎలా ఉందో పోలీసులు పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేశారని.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు జరిగాయన్నారు. 8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని.. నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లను కూల్చేశారన్నారు. గ్రామాలు వదిలివెళ్లే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. జర్నలిస్టులు, సోషల్ మీడియాలో విమర్శించిన వారినీ వదలడం లేదన్నారు. వైసీపీ అరాచకాలపై పోలీసులు అచేతనంగా మారారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలు గ్రామాలకు వెళ్లి... ఎక్కడికైనా వెళ్లండని ఉచిత సలహా ఇస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
స్పీకర్ పైన బాబు వ్యాఖ్యలు..
ఏ రాష్ట్రంలో జరగని విధంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీని దారుణంగా నడిపిస్తోందని, మేం 150 మంది సభ్యులం ఉన్నామంటూ బెదిరిస్తున్నారని, మేం లేస్తే ఒక్కరు కూడా మిగలరంటూ హెచ్చరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ కోన్ కిస్కా గొట్టంగాళ్లకు భయపడొద్దని స్పీకరు తమ్మినేని సీతారాం అంటున్నారని, స్పీకర్ స్థాయిని దిగజార్చొద్దని చంద్రబాబు సూచించారు. వైసీపీ ఇసుకపై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇసుక కొరత సృష్టించి.. ధరలు విపరీతంగా పెంచేశారని, చివరికి సిమెంట్ కంటే ఇసుక ధర ఎక్కువైందన్నారు. ఇసుక ధర ఇంతగా పెరగడానికి ఎవరు కారణమో జగన్ చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. అన్న క్యాంటీన్లు తొలగించి పేదల కడుపుకొట్టారన్నారు. ఎన్టీఆర్, వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తిచేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో అమరావతికి రైతులు భూములు ఇచ్చారని, వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి ప్రాభవం తగ్గిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.