రంగంలోకి చంద్రబాబు : అసలు లక్ష్యం అదే: అందుకే గోదావరి జిల్లాలు ఎంపిక..!!
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుండటంతో అన్ని జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిశ్చయించారు. వారానికో జిల్లాకు ఆయన పర్యటనకు వెళ్లాలని... రెండు రోజులు గడుపుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే చంద్రబాబు తొలుత గోదావరి జిల్లాల పర్యటన వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందనే ప్రచారం సాగుతోంది. ఎక్కడైతే కాకినాడలో కాపు నేతలు పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కలేదంటూ ఆవేదనతో సమావేశమై..చంద్రబాబు సూచనల మేరకు వెనక్కు తగ్గారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు..స్థానిక సంస్థల ఎన్నికలను పరిగణలోకి తీసుకొని నేతలు పార్టీ వీడకుండా నేరుగా తానే రంగంలోకి దిగాలని చంద్రబాబు రంగంలోకి దిగాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకే తొలి పర్యటన కాకినాడ లో మొదలు పెడుతున్నారు.
జిల్లాల పర్యటనకు చంద్రబాబు..
అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. పలు జిల్లాల్లో పార్టీ నేతలపై వేధింపులు, కేసుల నమోదు పెరిగిపోతుండటం, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుండటంతో అన్ని జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిశ్చయించారు. పనిలో పనిగా అక్కడ పార్టీ నేతలందరితో సమావేశమై సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెడతారు. ఈ పర్యటన తూర్పు గోదావరి జిల్లాతో ప్రారంభం కానుంది. వినాయకచవితి తర్వాత సెప్టెంబరు 5, 6 తేదీల్లో ఆయన తూర్పు గోదావరిలో పర్యటిస్తారు. కాకినాడలోనే రెండు రోజులు మకాం వేస్తారు. పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించడంతోపాటు ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులతో భేటీలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత వారానికో జిల్లాకు ఆయన పర్యటనకు వెళ్తారు. రెండు రోజులు గడుపుతారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం, అనుబంధ సంఘాల కార్యకలాపాల విస్తరణ, అన్ని వర్గాలతో సమన్వయం చేసుకొని పార్టీని పటిష్ఠం చేయడం ఈ పర్యటనలో ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వలసలు అడ్డుకోవటమే లక్ష్యంగా...
త్వరలో స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ తిరిగి ఈ ఎన్నికల ద్వారా నిలదొక్కోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా.. టీడీపీ నేతల వలసలను నిరోధించాలని..లేకుంగా మొత్తంగా నష్టం వస్తుందని గ్రహించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా టీడీపీలోని కాపు నేతలు సమావేశమై..పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేసారు. అప్పుడు విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు వచ్చిన తరువాత వారిలోని కొందరు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. లోకేశ్ ప్రాధాన్యత తగ్గించాలని డిమాండ్ చేసారు. పార్టీలో తాను చెప్పిందే జరుగుతుందని..ఆందోళన అవసరం లేదని చంద్రబాబు అభయం ఇచ్చారు. ఆ తరువాత వారు వెనక్కు తగ్గినట్లుగా కనిపించినా..మూడు నెలల కాలంలో పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు. కనీసం ప్రభుత్వం పైన విమర్శలు చేయటంలోనూ గోదావరి జిల్లాల నేతలు మౌనం పాటిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో పట్టు కోల్పోతే రాజకీయంగా భవిష్యత్ కష్టం. దీంతో.. ముందుగా తానే రంగంలోకి దిగి గోదావరి జిల్లాల్లో పార్టీ నేతలను తిరిగి యాక్టివ్ చేయగలిగితే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో..ఆయనే ఒక్క తూర్పు గోదవరి జిల్లాలోనే రెండు రోజులు పర్యటించాలని నిర్ణయించారు.
కాకినాడలో అందుకే మకాం..
కాకినాడ కేంద్రంగా గతంలో టీడీపీ కాపు నేతలు సమావేశమయ్యారు. ఇప్పుడు అదే కాకినాడలో చంద్రబాబు కీలక నేతలతో ఒన్ టు ఒన్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు. కొందరు కాపు నేతలు ఇప్పటికే వైసీపీతో కొందరు..బీజేపీతో కొందరు టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆ నేతలు సడన్ గా పార్టీ మారట పైన సంశయంతో ఉన్నారు. అటువంటి నేతలను పార్టీ వీడకుండా చూసేందుకు చంద్రబాబు ఈ పర్యటనలను ప్రధానంగా వినియోగించుకొనే అవకాశం ఉంది. అదే విధంగా వారి సమస్యలు తెలుసుకొని ..తానే వెళ్లి హామీ ఇవ్వటం ద్వారా ప్రయోజనం ఉంటుందని బాబు అంచనా వేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేసారు. అదే బాటలో జగ్గంపేట నేతలు సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. పాటుగా జిల్లాలోని టీడీపీకి గత ఎన్నికల వరకూ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోని నేతల పార్టీ మార్పు పైనా చర్చ సాగుతోంది. దీంతో..కాకినాడ కేంద్రంగా చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని భావిస్తున్నారు. దీంతో.. చంద్రబాబు పర్యటన ద్వారా గోదావరి జిల్లాల్లో చోటు చేసుకొనే రాజకీయాల పైన ఆసక్తి నెలకొని ఉంది.