కోడెల మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి..చంద్రబాబు సంచలనం : షోరూంలో ఫర్నీచర్ కోసం తనిఖీలు..!!
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ వ్యవహారం పైన మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆయన మీద ఫిర్యాదులు ఉంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చని..దానికి టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు. అదే సమయంలో రాజకీయంగా వేధిస్తామంటూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదే సమయంలో తన ఇంట్లో జరిగిన చోరీ వెనుక వైసీపీ హస్తం ఉందని కోడెల ఆరోపించారు. తన వద్దే అసెంబ్లీ ఫర్నీచర్ ఉందని కోడెల స్పష్టం చేయటంతో...పరిశీలన కోసం అసెంబ్లీ సిబ్బంది కోడెల కుమారుడి షోరూంలో తనిఖీలు చేసారు. ఆ సమయంలో కొంత ఫర్నీచర్ అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ సమయంలో కోడెల న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేసారు. అసెంబ్లీలో విలువైన ఫర్నీచర్ మాయం అయిందంటూ తాజాగా లెక్కలు బయటకు వస్తున్నాయి. కోడెల తీరు పైన వైసీపీ నేత అంబటి రాంబాబు మరో సారి తీవ్రంగా స్పందించారు.
కోడెలపైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పైన వస్తున్న ఆరోపణల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కోడెల మీద వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చట్ట పరంగా చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసారు. చట్ట పరంగా ముందుకు వెళ్తే టీడీపీ ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయదని తేల్చి చెప్పారు. అయితే, రాజకీయంగా వేధింపులకు దిగితే మాత్రం సహించేది లేదని కుండ బద్దలు కొట్టారు. దీంతో టీడీపీలో ఒక్క సారిగా చర్చ మొదలైంది. రెండు రోజుల క్రితం ఫర్నీచర్ తరలింపు విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్య సైతం కోడెల తీరును తప్పు బట్టారు. ఇప్పుడు చంద్రబాబు నేరుగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చాని వ్యాఖ్యానించటం ద్వారా ఇక టీడీపీలో కోడెలకు మద్దతు లేదనే విషయం స్పష్టమవుతోంది. కోడెల నివాసంలో దొంగ తనం గురించి చంద్రబాబు స్పందించారు. అంతకు ముందు కోడెల తన ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తం అంబటి రాంబాబు వద్ద పని చేస్తారని ఆరోపించారు. ఈ వ్యవహారం గురించి ఫోన్ ద్వారా పోలీసు అధికారికి ఫిర్యాదు చేసామని చెప్పుకొచ్చారు. దీని మీద వైసీపీ నేత అంబటి రాంబాబు సైతం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
కోడెల కుమారుడి షోరూం లో ఫర్నీచర్..
అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు పైన స్వయంగా కోడెల తన క్యాంపు కార్యాలయంలో ఉందని..తీసుకెళ్ల వచ్చని స్పష్టం చేసారు. దీంతో..అసెంబ్లీ అధికారులు స్థానిక ఎమ్మార్వోతో కలిసి కోడెల తనయుడి ద్వి చక్ర వాహన షోరూం వద్దకు వచ్చారు. అప్పటికే సీజ్ చేసిన షోరూం ను రవాణా అధికారులు ఓపెన్ చేసారు. కాగా, అక్కడ అసెంబ్లీకి సంబంధించి కుర్చీలు..ఇతర ఫర్నీచర్ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. తాము సేకరించిన సమాచారాన్ని అసెంబ్లీ కార్యదర్శికి నివేదిస్తామని అధికారులు స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఫర్నిచర్ విలువ రూ.2కోట్లకు పైగా ఉంటుందంటుందని అధికారులు చెబుతున్నారు. నిజాం కాలం నాటి టేబుళ్లు, కుర్చీలు మాయమైనట్లు గుర్తించారు. బర్మా టేకుతో చేసిన టేబుళ్లు, డిజైనర్ కుర్చీలు, సోఫాలు మాయమైన వాటిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సభ్యుల లాంజ్లోని తెలుపు 80 కుర్చీలు, స్పీకర్ యాంటీ రూమ్లోని మూడు కుర్చీలు, మూడు సోఫాలు, ఒక త్రీ సీటర్ సోఫా, పది చెక్క కుర్చీలు, స్పీకర్ చాంబర్లోని ఎగ్జిక్యూటివ్ కుర్చీలు, సందర్శకుల కుర్చీలు మయమైనట్లు అధికారులు చెబుతున్నారు.
అంబటి రాంబాబు ఫైర్...
కోడెల తన కార్యాలయంలో జరిగిన దొంగ తనం గురించి చేసిన వ్యాఖ్యల మీద అంబటి రాంబాబు స్పందించారు. దొంగతనం చేసాడని చెబుతున్న వ్యక్తిని తాను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేసారు. గతంలో అ వ్యక్తి కోడెల కార్యాలయంలో పని చేసాడా లేదా అనేది తనకు తెలియదన్నారు. తనకు కోడెల నివాసంలో దొంగ తనం చేయించాల్సిన అవసరం లేదని చెప్పారు. తన క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ ఫర్నీచర్ ఉందని చెప్పారని..అయితే కోడెల కుమారుడి షోరూం లో ఫర్నీచర్ ఎందుకు ఉందని అంబటి ప్రశ్నించారు.