పల్నాడులో చంద్రబాబు: అమరావతికి మద్దతుగా: వైసీపీ కౌంటర్ ప్లాన్..!
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ పర్యటన చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నర్సరావు పేటకు రానున్నారు. అమరావతి జేఏసీ తో కలిసి ఆయన ఇప్పటికే మూడు జిల్లాల్లో పర్యటించారు. ఇక, ఇప్పుడు రాజధాని జిల్లా అయిన గుంటూరులోని పల్నాడు ప్రాంతంలో అమరావతికి మద్దతుగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. మూడు రాజధాను ల ప్రతిపాదన..విశాఖకు పరిపాలనా రాజధానిని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు.
ప్రజా మద్దతు కూడగట్టేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఇక, ఈ రోజు చంద్రబాబు పల్నాడు పర్యటనకు వస్తుండటం ఆసక్తి కరంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం పల్నాడు ప్రాంతంలోని మాచర్ల ఎమ్మెల్యే పైన రాజధాని కోసం ఉద్యమిస్తున్న వారు దాడికి దిగారు. దీంతో..ఇప్పటికే టీడీపీకి కౌంటర్ గా అనేక ప్రాంతాల్లో మూడు రాజధాను ల నిర్ణయానికి మద్దతుగా వైసీపీ ర్యాలీలు నిర్వహిస్తోంది. దీంతో..పల్నాడు ప్రాంతంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
పల్నాడులో చంద్రబాబు పాదయాత్ర..
అమరావతి రైతులకు మద్దతుగా నరసరావుపేటలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నర్సరావుపేట పట్టణంలో పాదయాత్ర.. బహిరంగ సభ లో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబునాయుడితో పాటు అమరావతి జేఏసీ నేతలు పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాన్ని వెనుకకు తీసుకోనేవరకు ప్రతి ఇంటినుంచి ఒకరు ఈ ఉద్యమంలో పాల్గొనాని ఇప్పటికే చంద్రబాబు పిలుపు నిచ్చారు. మచిలీపట్నం..రాజమండ్రి..తిరుపతిలో చంద్రబాబు పర్యటన పూర్తయింది.
ప్రభుత్వం ఈ నెల 18న కేబినెట్ సమావేశం..ఆ తరువాత 20న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మూడు రాజధానుల అంశం పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇదే సమయంలో దీనిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు జిల్లాల పర్యటన వేగవంతం చేసారు. సంక్రాంతి పండుగకు దూరంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతో..అటు ప్రభుత్వం అడుగులు..ఇటు అడ్డుకొనేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలు ముమ్మరం చేసాయి.
వైసీపీ కౌంటర్ ర్యాలీలు..
అమరావతి జేఏసీ నేతలు..టీడీపీ నాయకులు మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా..టీడీపీకి కౌంటర్ గా ఉత్తరాంధ్ర.. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వైసీపీ ర్యాలీలు నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితం పల్నాడు ప్రాంతానికే చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి మీద జాతీయ రహదారిపైన అమరావతి నిరసనకారులు దాడికి దిగారు.
ఆ వెంటనే మాచర్ల ప్రాంతంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో..ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి ఆందోలనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటన కోసం భారీగా నర్సరావు పేటకు తరలి రావాలని పార్టీ ఇప్పటికే ఆదేశించింది.