కుంభకోణాల చిట్టాతో చంద్రబాబు సంచలనం.. చేపల చెరువుకు కొంగల కాపలా.. జగన్పై నిప్పులు..
నిండుగా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తయారైందన్నారు ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వైసీపీ సర్కారుపైనా, సీఎం జగన్ పైనా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 12 నెలల కాలంలోనే వైసీపీ సర్కారు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించిన ఆయన.. జగన్ అవినీతి సినిమాకు ఇది కేవలం ట్రైలర్ లాంటిదని, రాబోయే రోజుల్లో బెంబేలెత్తించడం ఖాయమని అన్నారు.
వరుస ట్వీట్లు..
జగన్ ఏడాది పాలనను సామూహిక వినాశనంగా అభివర్ణించిన చంద్రబాబు.. ఆదివారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. గత 12 నెలలుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న కుంభకోణాలు ఇవేనంటూ సంచలన కామెంట్లు చేశారు. వాటికి సంబంధించిన వీడియోలను సైతం విడుదల చేశారు. మట్టి నుంచి బ్లీచింగ్ పౌడర్ దాకా దేన్నీ వదలకుండా వైసీపీ నేతలు స్వాహా చేస్తున్నారని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు.
ఇసుకతో మొదలు..
గతంలోనే వేల కోట్ల అవినీతి చేసి జైలుకు కూడా పోయి వచ్చిన చరిత్ర జగన్కు ఉందని, అలాంటోళ్ల చేతికి చేతికి అధికారం చిక్కాక అద్దూ, అదుపు లేకుండా అవినీతి సాగుతోందని చంద్రబాబు విమర్శించారు. జగన్ సీఎం అయిన వెంటనే ఇసుకపై పడ్డారని, టీడీపీ హయాంలో రూపొందించిన ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి, రీచ్ లన్నిటినీ వైసీపీ శాండ్ మాఫియా పరం చేశారని, కేవలం 12నెలల్లోనే 13లక్షల టన్నుల ఇసుకను మాయం చేసేశారని టీడీపీ చీఫ్ ఆరోపించారు. ఇసుకతోపాటు ఇక గ్రావెల్, మట్టి స్కామ్ లకు సైతం పాల్పడ్డారని, భూ కబ్జాలకైతే అంతేలేదని దుయ్యబట్టారు.
బ్లీచింగ్ పౌడర్ పేరుతో..
‘‘కరోనా మహమ్మారికి విరుగుడు బ్లీచింగ్ పౌడరే అని, దాన్ని చల్లితే వైరస్ పారిపోతుందని సీఎం సెలవిచ్చారు. చివరికి అదే బ్లీచింగ్ కొనుగోళ్లలోనూ స్కాములు జరిగాయి. ఒక్క జిల్లాలోనే బ్లీచింగ్ కొనుగోళ్లలో రూ.75 కోట్ల కుంభకోణం వెలుగుచూసిందంటే.. మిగిలిన జిల్లాలు అన్ని కలిపితే ఏస్థాయిలో అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చు. కరోనా టెస్టింగ్ కిట్లలోనూ దోపిడీకి పాల్పడ్డారు. రూ.333 విలువ చేసే కరోనా కిట్ రూ.770కి కొనడం మరో కుంభకోణం. ఇవి కాకుండా పేదల పేరుతో నడుస్తోన్న అన్ని పథకాల్లోనూ భారీగా స్కాములు జరుగుతున్నాయి''అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఒక్క అవలోనే రూ.400కోట్లు..
పేదలకు ఇళ్ల స్థలాలు అందిచే ముసుగులో వైసీపీ సర్కారు భారీ ఎత్తున భూకొనుగోళ్లకు పాల్పడిందని, ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల కుంభకోణాలు చేశారని, కేవలం ఆవ భూముల్లో రూ.400 కోట్లు స్కామ్ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలకు వాటాలు ఇవ్వని పారిశ్రామిక వేత్తల నుంచి, మద్యం కంపెనీల నుంచి ‘జె-టాక్స్'లు వసూళ్లు చేయడం సాధారణ విషయంగా మారిందన్నారు.
గవర్నమెంట్ టెర్రరిజం..
వైసీపీ ఏడాది పాలనలో చిన్న ఉద్యోగాలను సైతం అమ్మకానికి పెట్టి డబ్బులు దండుకున్నారని, చివరికి ప్రజల దాహార్తిని తీర్చే రిజర్వాయర్లలోని నీళ్లను సైతం అమ్ముకున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. 'దోచుకో- దాచుకో' అనేది వైసీపీ అవినీతి విధానమని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానమిప్పుడు ‘గవర్నమెంట్ టెర్రరిజం'గా రూపాంతరం చెందిందని, ప్రభుత్వాన్ని చూసి ప్రజలందరూ బెంబేలెత్తుతున్నారని చంద్రబాబు అన్నారు. ఏడాది పాలనలోనే ‘జగ'మేత ఈ రేంజ్ లో ఉంటే.. రాబోయే కాలంలో అది భరించలేని స్థాయిలో ఉండొచ్చని, ఈ దోపిడీని అడ్డుకోవాల్సింది ప్రజలేనని, ప్రజలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.