వేడెక్కిన ఉత్తరాంధ్ర: కమ్మవాళ్ల కోసమేనంటూ: విశాఖలో చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం: అర్ధరాత్రి..!
విశాఖపట్నం: ఒక్క నిర్ణయం.. రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. ఉల్టా చేసింది. నిన్నటిదాకా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలతో చెలరేగిన అమరావతి ప్రాంత రైతులు విజయోత్సవాలు చేసుకుంటుండుగా.. ఇన్నాళ్లు వారు చేసిన ఉద్యమ పంథాను ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు అందుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర ప్రజలు అర్ధరాత్రి రోడ్ల మీదికి వచ్చి నిరసనోద్యమాలకు దిగారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంతకుముందే- తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ ఇంటిని ముట్టడించారు.
పాలన వికేంద్రీకరణ: కర్నూలులో హైకోర్టు: పార్టీ ఉద్దేశం అదే: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!
మండలి ఛైర్మన్ నిర్ణయానికి నిరసనగా..
ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు భగ్గు మంటున్నారు. దీనికంతటికీ కారణం తెలుగుదేశం పార్టీయేనని మండిపడుతున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మధురవాడ, రామకృష్ణా బీచ్, అంకమ్మతోట, జగదంబ జంక్షన్, అల్లీపురం మసీదు రోడ్డు వంటి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
కమ్మవారి కోసమే
చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గమైన కమ్మవారి కోసమే రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని వారు ఆరోపించారు. అమరావతిని సింగపూర్గా మార్చేస్తానంటూ అయిదేళ్ల పాటు కాలక్షేపం చేసిన చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ.. తీరు మార్చుకోలేదని మండిపడుతున్నారు. అయిదేళ్లలో చంద్రబాబు అమరావతిలో శాశ్వత కట్టడాలు నిర్మించి ఉంటే.. ఈ పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు.
వెలగపూడి ఇంటిని ముట్టడించిన విశాఖవాసులు
అంతకుముందే- నిరసనకారులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటి ముందు బైఠాయించారు. విశాఖపట్నం చిత్రపటాలను పట్టుకుని చంద్రబాబు, వెలగపూడికి నిరసనగా నినాదాలు చేశారు. విశాఖపట్నం ద్రోహి అంటూ నినదించారు. ఆయన ఇంటి ముఖద్వారం గేటును దాటడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శ్రీకాకుళం, విజయనగరంలో కూడా..
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబును ఉత్తరాంధ్ర ద్రోహిగా పేర్కొంటూ ఆయా జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రాంతాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఉద్యమాలకు సారథ్యాన్ని వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికే చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. కమ్మసామాజిక వర్గం కోసం మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.