తిరుపతిలో హోరాహోరీ- ప్రచార బరిలోకి చంద్రబాబు-14న జగన్తో బిగ్ఫైట్ ?
తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ముక్కోణపు పోటీ నెలకొంది. తొలుత వైసీపీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించినా మారుతున్న సమీకరణాల నేఫథ్యంలో ఆ పార్టీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పాటు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి నుంచి ఎదురవుతున్న పోటీతో తమ అవకాశాలపై ఎక్కడ ప్రభావం పడుతుందో అనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. దీంతో ఏకంగా సీఎం జగన్ను రంగంలోకి దించుతోంది. అదే సమయంలో ఇవాళ్టి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచారం ప్రారంభిస్తున్నారు. ప్రచార ముగింపుకు ఒక్క రోజు ముందు ఏప్రిల్ 14న బిగ్ఫైట్ తప్పేలా లేదు.
తిరుపతిలో హట్హాట్గా ఉపఎన్నిక
వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్సభ స్ధానంలో ఈ నెల 17న ఉపఎన్నిక జరగబోతోంది. ఇందులో వైసీపీ, టీడీపీతో పాటు బీజేపీ-జనసేన మధ్య గట్టి పోటీ నెలకొంది. సామాజిక వర్గాల వారీగా చూసినా ఈ ఉపఎన్నికలో అభ్యర్ధుల మధ్య గట్టిపోటీ నెలకొంది. ఓట్ల చీలికలు, స్ధానిక అంశాలు, ధన, మధ్య ప్రవాహాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అంశాలు ఈ ఎన్నికలో కీలకంగా మారిపోతున్నాయి. దీంతో తిరుపతిలో ఓ దశలో రికార్డు మెజారిటీ సాధిస్తామని చెప్పిన వైసీపీకి ఇప్పుడు టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ అడుగుపెట్టక తప్పడం లేదా ?
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి విజయానికి జగన్ పెట్టిన టార్గెట్ 5 లక్షల మెజారిటీ. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిని వైసీపీ నుంచి పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాద్ 2.2 లక్షల మెజారిటీతో ఓడించారు. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసి చూపాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ టార్గెట్ పెట్టారు. అయినా ఇది సాధ్యమయ్యేలా లేదు. ప్రస్తుతం తిరుపతిలో నెలకొన్న ముక్కోణపు పోటీకి తోడు స్ధానిక ఎన్నికల తరహా రాజకీయాలకు అవకాశం లేకపోవడం వైసీపీకి మైనస్ అవుతోంది. దీంతో ఇక జగన్నే ప్రచారానికి రావాలని అక్కడ ప్రచారానికి పంపిన నేతలు అడగటం మొదలుపెట్టారు. దీంతో జగన్ రంగంలోకి దిగడం ఖాయమైంది. ఏప్రిల్ 14న ఒక్కరోజు ప్రచారానికి పరిమితం కావాలని జగన్ భావిస్తున్నారు.
నేటి నుంచి చంద్రబాబు సుడిగాలి ప్రచారం
తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో అత్యంత సీనియర్, కేంద్ర మాజీ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి ఉంది. గత ఎన్నికల్లో సైతం ఆమె పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఓ రకమైన సానుభూతి ఎలాగో ఉంటుంది. దీనికి తోడు స్ధానికంగా వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి సామాజిక వర్గానికే చెందిన పనబాక లక్ష్మి ఎంట్రీతో అక్కడ ఓట్ల చీలిక తప్పేలా లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాల ప్రభావం ఉన్నప్పటికీ కుల సమీకరణాల్ని కాదని ఎవరూ ముందుకెళ్లలేని పరిస్ధితి. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభకు సీటిచ్చింది. దీంతో పనబాకకు ఓ విధంగా మేలు జరిగినట్లే. ఆరంభంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రంగంలోకి దిగిన టీడీపీకి పరిస్ధితులు అనుకూలంగా లేకపోయినా రోజులు గడుస్తున్న కొద్దీ అనుకూలతలు కనిపిస్తున్నాయి. దీంతో ఇవాళ్టి నుంచి చంద్రబాబు కూడా ప్రచార బరిలోకి దిగుతున్నారు. 8 రోజుల ప్రచారంలో 7 బహిరంగసభల్లో ఆయన పాల్గొనబోతున్నారు.
Recommended Video
ఏప్రిల్ 14న చంద్రబాబు వర్సెస్ జగన్ బిగ్ ఫైట్
ఇవాళ్టి నుంచి తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోకి దిగుతున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా రూట్మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. మారిన పరిస్ధితుల్లో ఇంటిలిజెన్స్ నివేదికలు, పార్టీ వర్గాల విజ్ఞప్తులతో ప్రచార బరిలోకి దిగాలని జగన్ నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ప్రచారానికి వచ్చే రోజు తాను కూడా పోటాపోటీ ప్రచారం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వారం రోజుల రూట్ మ్యాప్ ప్రకటించకుండా రోజువారీ రూట్మ్యాప్, షెడ్యూల్ను టీడీపీ విడుదల చేస్తోంది. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి తరఫున ప్రచారానికి ఏప్రిల్ 14న జగన్ వస్తారని భావిస్తున్నారు. అదే రోజు జగన్కు పోటీగా తాను కూడా తిరుపతి నగరంలో ప్రచారం నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. దీంతో ఏప్రిల్ 14న జగన్ వర్సెస్ చంద్రబాబు బిగ్ఫైట్ తప్పదని తెలుస్తోంది.