విశాఖలో చంద్రబాబుపై దాడి.. చెప్పులు, కోడిగుడ్లతో వైసీపీ వీరంగం.. రణరంగంగా ఎయిర్ పోర్టు..
'ఒక రాష్ట్రం ఒక రాజధాని' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరో చేదు అనుభవం ఎదురైంది. రెండ్రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గురువారం విశాఖపట్నం వచ్చిన ఆయనపై అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాబు విశాఖ ఎయిర్ పోర్టులో విమానం దిగిబయటికిరాగానే.. వందలాదిమంది వైసీపీ శ్రేణులు ఆయనను చుట్టుముట్టి.. వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బాబు కాన్వాయ్ పై చెప్పులు, కోడిగుడ్లతో దాడి జరిగింది.
Recommended Video
ఎందుకు వచ్చారంటే..
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమిస్తోన్న చంద్రబాబు.. అధికారిక ప్రకటన రాకముందే ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు సేకరించడాన్ని తప్పుపట్టారు. విశాఖ ఎయిర్పోర్టు నుంచి పెందుర్తి మండలంలో రైతుల్ని కలవడానికి వెళ్లాల్సి ఉండగా వైసీపీ శ్రేణులు ఆయనను ఎయిర్ పోర్టులోనే నిర్బంధించారు. బాబు పర్యటనపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో పోలీసులు సైతం పెద్ద సంఖ్యలో మోహరించిఉన్నప్పటికీ.. ఆయన కాన్వాయ్ పై చెప్పులు, కోడిగుడ్లతో దాడి జరగడం గమనార్హం.
రణరంగంగా ఎయిర్ పోర్టు..
బాబు విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఎయిర్ పోర్టు వైవునకు కదిలారు. అప్పటికే అక్కడ వేల మంది వైసీపీ శ్రేణులు మోహరించారు. చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చేక్రమంలో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఆయను చుట్టుముట్టాయి. కోడిగుడ్లు, చెప్పులతో దాడి జరిపాయి. కోడిగుడ్లు పోలీసులపై పడటంతో బాబు తృటిలో తప్పించుకున్నట్లయింది. దీంతో టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలతో బాహాబాహీకి దిగారు. తోపులాటలు, అరుపులతో ఎయిర్ పోర్టు ప్రాంతమంతా రణరంగంగా మారింది.
ఓకే అంటేనే వదులుతాం..
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు అంగీకరిస్తేనే చంద్రబాబును ఉత్తరాంధ్రతో తిరగిస్తామని అధికార వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రకటన చేస్తేనే కాన్వాయ్ కి దారిస్తామని, లేదంటే అడుగడుగునా చుక్కలు చూపెడతామని హెచ్చరించారు. అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నందునే ఇలాంటి పరిస్థితి నెలకొందని విమర్శించారు.
వెనక్కి తగ్గని బాబు..
ఎయిర్ పోర్టులో తన కాన్వాయ్ కి అడ్డంగా వైసీపీ కార్యకర్తలు బైఠాయించడంతో దాదాపు గంటసేపు చంద్రబాబు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చే అన్ని మార్గాల్లోనూ వైసీపీ శ్రేణులు మోహరించిఉండటంతో ఆయన కారు దిగి.. కాలినడకన బయటికొచ్చేందుకు ప్రయత్నించారు. చంద్రబాబువెంట అచ్చెంనాయుడుతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన కీలకనేతలున్నారు.