రింగ్ దాటి వస్తే బయట పడెయ్యమన్న జగన్..మండలిలో మీ మంత్రులు చేసిందేమిటి : చంద్రబాబు
ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి శాసనమండలిలోనూ బిల్స్ పాస్ చేయించాలని ప్రయత్నం చేసిన ఏపీ ప్రభుత్వానికి టీడీపీ షాక్ ఇచ్చింది. మండలిలో టీడీపీ తాము అనుకున్న విధంగా సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపేలా చేసి పై చెయ్యి సాధించింది. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో మండలి రద్దుకు వైసీపీ సర్కార్ ప్రయత్నాలు సాగిస్తూ మంత్రులతో కీలక భేటీ నిర్వహిస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తుంది.
పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ఇక ఈ క్రమంలో పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని ఉద్యమంలో టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ప్రశంసించారు. ఇవాళ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు ఈ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
మంత్రులు టీడీపీ ఎమ్మెల్సీలపై దౌర్జన్యం చేశారన్న బాబు
శాసనమండలిలో మంత్రులు టీడీపీ ఎమ్మెల్సీలపై దౌర్జన్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు. లోకేష్పైకి దూసుకెళ్లారని పేర్కొన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్పై దాడికి ప్రయత్నించారని బాబు ఆరోపించారు. మంత్రి బొత్స సత్యన్నారాయణ షరీఫ్ గురించి అవహేళనగా మాట్లాడారని చంద్రబాబు పేర్కొన్నారు . మొత్తం 25మంది మంత్రులు మండలిలో కూర్చొని ఇష్టం వచ్చినట్లు చేశారని వీరంగం వేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ వారు ఏం చేసినా సరే టీడీపీ మాత్రం పోరాటం చేసి విజయం సాధించిందని చంద్రబాబు పేర్కొన్నారు.
మండలిలో వీరంగం వేసిన మంత్రులను, వైసీపీ ఎమ్మెల్సీలను ఏం చెయ్యాలి?
ఇక అంతే కాదు అసెంబ్లీలో స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేస్తేనే వీధి రౌడీలని మాట్లాడి రింగుదాటి వస్తే బయటపడేయండని మార్షల్స్ను జగన్ ఆదేశించారన్న చంద్రబాబు మండలిలో వైసీపీ మంత్రులు చేసిందేమిటి? అని ప్రశ్నించారు . పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి శాసనమండలి చైర్మన్ షరీఫ్ పై విసిరిన మంత్రులను, వైసీపీ ఎమ్మెల్సీలను ఏం చేయాలి అంటూ నిలదీశారు.
అమరావతి పరిరక్షణ ఇక ప్రజల చేతుల్లోనే.. చంద్రబాబు పిలుపు
శాసన మండలిలో 25మంది మంత్రులు తిష్టవేసి వీరంగం వేశారని పేర్కొన్నారు . ఇక మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి కోసం పోరాటం చేస్తున్న ఎంపీ గల్లా జయదేవ్ను శారీరకంగా, మానసికంగా హింసించారని చంద్రబాబు పేర్కొన్నారు . ఇక అమరావతి పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉందని చంద్రబాబు అన్నారు . జేఏసీ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పిలుపునిచ్చారు.