అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ సర్కార్.. మద్యంవిక్రయంలో లొసుగులు, త్వరలో సారా..? చంద్రబాబు విసుర్లు
ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ హయాంలో కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వ వైఖరి వల్లే సంస్థలు ఏపీ నుంచి వెళ్తున్నాయని చెప్పారు. మద్యపాన నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే లిక్కర్ విక్రయించడం ఏంటి అని ప్రశ్నించారు. ఇసుకతో వ్యాపారం చేస్తున్నారని.. సిమెంట్ కంపెనీలను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
యధా రాజా.. తధా ప్రజా..
రాష్ట్రంలో పోలీసులు రెచ్చిపోతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. యధా రాజా.. తధా ప్రజా అన్నట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ తమకు నీతులు చెబుతారా అని ప్రశ్నించారు. మంత్రులు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఇది సరికాదని సూచించారు. జగన్ తీరు రోమ్ చక్రవర్తి మాదిరిగా ఉందన్నారు. ఓ వైపు కార్మికులు చనిపోతుంటే.. జగన్ వీడియో గేమ్స్ ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే మద్యం విక్రయిస్తోంది..
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ప్రభుత్వమే లిక్కర్ విక్రయించడం సరికాదని చంద్రబాబు అన్నారు. ఆయా షాపుల్లో ప్రభుత్వం మందు విక్రయిస్తోందని చెప్పారు. మద్యపానంపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు.. మందును అమ్మే పరిస్థితి ఏర్పడిందన్నారు. సమయం కుదించడంలో కూడా స్ట్రాటజీ ఉందని చంద్రబాబు తెలిపారు. రాత్రి 8 గంటల వరకు ఇక్కడ షాపులు మూసి.. ఆ తర్వాత బెల్ట్ షాపులను బార్లా తెరిచారని పేర్కొన్నారు. బెల్ట్ షాపులన్నీ వైసీపీ కార్యకర్తలవేనని ఆరోపించారు.
త్వరలో సారా కూడా..
రాష్ట్రంలో కొద్దిరోజుల్లో సారా కూడా కాసే పరిస్థితి ఉందన్నారు. దానిని ఫ్రీ గా అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారని పేర్కొన్నారు. గతంలో చెప్పులు వేసి సారా తయారు చేశారని గుర్తుచేశారు. యూరియా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. కానీ అప్పటి తమ ప్రభుత్వం అన్నింటినీ నియంత్రించామని పేర్కొన్నారు. మద్యం పేరుతో రూ.2500 కోట్లు, ఇసుకకు సిమెంట్ కంపెనీలు డబ్బుల పేరుతో వేల కోట్లను తీసుకుంటున్నారని ఆరోపించారు. పనిచేసేవారిని చేయనీయకుండా బెదిరించి జే ట్యాక్స్ కటిస్తున్నారని పేర్కొన్నారు. జే ట్యాక్స్ అంటే జగన్ మోహన్ రెడ్డి పన్ను అని చంద్రబాబు తెలిపారు.
సీమకు జలకళ..
తమ హయాంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్తో సీమకు జలకళ వచ్చిందని తెలిపారు. రహదారులను కూడా అభివృద్ధి చేశామని చెప్పారు. చిత్తూరు తిరుపతికి ఆరు లైన్ల రోడ్డును ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పరిశ్రమల స్థాపనకు విశేషంగా కృషి చేశామని చెప్పారు. 15 వేల కోట్లతో రిలయన్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వచ్చిందని.. అయితే వారికి భూమి ఇవ్వకపోవడంతో వెనుదిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. చిత్తూరులో అప్పట్లో అమరరాజా ఒక్కటే పెద్ద కంపెనీ అని తెలిపారు. టెలిఫోన్లు, హార్డ్ వేర్, టెక్స్ టైల్స్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కానీ అవి నేడు పారిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
4 నెలల్లో నీరు..
కరవు జిల్లా అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. నీరు లేకుండా పరిశ్రమ ఎలా అని అప్పట్లో తనను చాలా మంది అడిగారని పేర్కొన్నారు. కానీ గొల్లపల్లి రిజర్వాయర్కు 4 నెలల్లో నీరు తీసుకొచ్చామని గుర్తుచేశారు. నీరు తీసుకొచ్చాకే కియా ప్రాజెక్టు ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. కానీ జగన్ పాలనలో ప్రాజెక్టులు, కంపెనీలు, పరిశ్రమలు తిరిగి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పారు. పారిశ్రామికవేత్తలను బెదిరించే పద్ధతి మంచిది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.