త్వరలో ఢిల్లీకి చంద్రబాబు?: మళ్లీ జాతీయ రాజకీయాల వైపు: అమిత్ షాతో: లోకేష్ కోసమేనా?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మళ్లీ దేశ రాజకీయాల్లోకి పునఃప్రవేశించబోతోన్నారా?..కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో చేరడానికి సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారా?.. దీనికోసం త్వరలో ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అమిత్ షా ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
మంత్రి పెద్దిరెడ్డి సూచనలను నిమ్మగడ్డ పాటిస్తారా?: చంద్రబాబు సొంత జిల్లా టూర్కు ఎస్ఈసీ
అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీలో
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో అమిత్ షాతో భేటీ అయ్యారు. గుంటూరు, విజయవాడ లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.. 20 నిమిషాలకు పైగా అమిత్ షాతో సమావేశం అయ్యారు. పితృత్వ సెలవుల్లో ఉన్న కారణంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీకి వెళ్లలేదు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించడానికే వారు అమిత్ షాను కలిశారని పైకి చెబుతున్నప్పటికీ.. అసలు విషయం వేరేగా ఉందని అంటున్నారు.
చంద్రబాబుకు అపాయింట్మెంట్..
చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించాలనే ఏకైక కారణంతో వారు అమిత్ షాను కలిశారని తెలుస్తోంది. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే.. ఇదివరకు ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి దారి తీసిన పరిణామాలు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్తో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చిందనే విషయాలపై వివరణ ఇస్తారని ఎంపీలు ఈ సందర్భంగా అమిత్ షానకు వివరించినట్లు చెబుతున్నారు. దీనిపై అమిత్ షా అప్పటికప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. చంద్రబాబును కలవడానికి మాత్రం సుముఖంగానే ఉన్నారని అంటున్నారు.
అమిత్ షా కాదంటే.. కాంగ్రెస్ వైపు..
ఎన్డీఏలో చేరడానికి అమిత్ షా గానీ.. బీజేపీ పెద్దలు గానీ అంగీకరించకపోతే.. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చంద్రబాబు దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తెలుగుదేశం పార్టీని తటస్థంగా ఉంచడానికి ఆయన పెద్దగా ఇస్టపడట్లేదనే వాదనలు ఉన్నాయి. ఎన్డీఏ లేదా యూపీఏ కూటమిలో చేరడం వల్ల జాతీయ పార్టీల అండ లభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండింట్లో ఎన్డీఏలో చేరడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని, దేశ రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్న నేత కావడం, టీడీపీ జాతీయపార్టీగా ఆవిర్భవించిన పరిస్థితుల్లో అదే స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించాలని ఆయన యోచిస్తున్నారని తెలుస్తోంది.
Recommended Video
నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసమే..
ప్రస్తుతం చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలు.. కుమారుడు, మాజీమంత్రి నారా లోకేష్ కోసమేనని అంటున్నారు. జాతీయ కూటమిలో చేరడం వల్ల టీడీపీకి అదే స్థాయిలో మద్దతు లభిస్తుందని, భవిష్యత్తులో నారా లోకేష్ రాజకీయంగా ఎదగడానికి ఉపకరిస్తుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో బలపడిన ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కొనడానికి జాతీయ పార్టీ అండ కావాల్సి ఉంటుందని పార్టీ శ్రేణుల నుంచి చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని అంటున్నారు.