అసెంబ్లీ నుంచి ర్యాలీగా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత సహా ఎమ్మెల్యేల అరెస్ట్..
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆందోళన కొనసాగించింది. ఇటీవల మందడంలో రైతులపై పోలీసులు లాఠీచార్జీ ఆరోపిస్తున్న టీడీపీ.. అక్కడికి ర్యాలీగా వెళ్లాలని బయల్దేరింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు.
హైటెన్షన్..
తమను ఎందుకు అరెస్ట్ చేశారని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారితో కాసేపు వాగ్వివాదం కూడా జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు నాయుడు మంగళగిరి పోలీసుస్టేషన్ వరకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. చంద్రబాబు సహా నేతలను బస్సులో ఎక్కించారు. చంద్రబాబు సహా టీడీపీ నేతల అరెస్ట్తో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
17 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్
వాస్తవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే సమయంలో అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు భావించారు. కానీ సభలో బిల్లుపై చర్చ జరిగే సమయంలోనే 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సీఎం జగన్ మాట్లాడే సమయంలో అడ్డుకోవడంతో సస్పెండ్ చేయాల్సి వచ్చింది. మార్షల్స్ వారిని బయటకు తీసుకొచ్చాక.. పోలీసులు పీఎస్కు తరలించారు. దీంతో టీడీపీ ప్లాన్ బెడిసికొట్టనట్లైంది.
సీఆర్డీఏ పరిధిలో తిప్పుతూ...
ముందస్తుగా టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంతో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. అయితే చంద్రబాబు సహా టీడీపీ నేతలను గత 50 నిమిషాలుగా బస్సులో ఎక్కించుకొని తిప్పుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలోని మట్టి రోడ్డుపై తిప్పుతున్నారని చెప్తున్నారు. అయితే వారిని పోలీసు స్టేషన్ తరలిస్తారా ? లేదంటే చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లారా అనే అంశంపై క్లారిటీ లేదు.