సీఎం జగన్ అహంభావి: వైరస్ ప్రబలుతుంటే ఎన్నికల ముఖ్యమా..? చంద్రబాబు నిప్పులు
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య అగ్గిరాజేసింది. ఎన్నికలను వాయిదా వేయడాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని పై స్థాయికి కూడా తీసుకెళతామని పేర్కొన్నారు. జగన్ వైఖరిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంటే.. స్థానిక సంస్థల ఎన్నికలే ముఖ్యమయ్యయా అని మండిపడ్డారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రసంగించే ముందు.. ప్రపంచ ఆరోగ్య సంస్థం డైరెక్టర్, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన వీడియోను మీడియాకు చూపించారు.
ఎన్నికలే ముఖ్యమా..?
ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమంత్రి జగన్కు ఎన్నికలే ముఖ్యమని చంద్రబాబు విమర్శించారు. కరోనా వైరస్పై జగన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ అహంభావం రాష్ట్రానికి శాపంగా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ అనేది మహమ్మరి అని దానిని ఎదుర్కొవాలే తప్ప.. అహంభావంతో ప్రవర్తించడం సరికాదన్నారు. వైరస్ ప్రబలుతోన్న సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి.. ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు. స్థానిక సంస్థలో పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించబోతున్నారని.. దీంతో ఎంత ప్రమాదమో ఊహించుకుంటే భయమేస్తోందని చంద్రబాబు అన్నారు.
వైరస్ ప్రబలదా..?
కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి ఓటేసిన తర్వాత... అతని వెనకాల బ్యాలెట్తో ఓటేసే వారికి ఎంతమందికి వైరస్ వ్యాపిస్తోందో ఊహించుకోవాలని చంద్రబాబు సూచించారు. కానీ ఒంటెద్దు పోకడలతో జగన్ ప్రభుత్వం ముందుకెళ్లిందన్నారు. వైరస్ దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తే ఈసీని బెదిరించడం మంచి పద్దతి కాదన్నారు. ఇటీవల మండలి చైర్మన్ను కూడా బెదిరింపులకు గురిచేశారని... ఏకంగా మండలినే రద్దుచేశారని తెలిపారు. ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్ చంద్రబాబు గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఫిర్యాదు చేస్తే... సీఎస్, ఇంటెలిజెన్స్ డీజీ, ఇద్దరు ఎస్పీలను బదిలీ చేయలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
107 పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మరీగా ప్రకటించగా, మిగతా దేశాలు అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో... సీఎం జగన్ మాత్రం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. కేంద్రప్రభుత్వం కూడా చర్యలు తీసుకుందని.. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అమెరికా 2.7 ట్రిలియన్ డాలర్లు కేటాయించిందని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలో 12 రాష్ట్రాల్లో 107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.