వైసీపీకి ఓటమి భయం... అధికార పార్టీ పతనానికి ఇదే నాంది.. : పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల సైరన్ మోగడంతో ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీని ఢీకొట్టేందుకు సిద్దమవుతోంది. తాజాగా టీడీపీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... పంచాయతీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికలే వైసీపీ పతనానికి నాంది కావాలని అన్నారు.
పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న రౌడీ రాజ్యానికి ముకుతాడు వేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు బరిలో దిగాలని... వైసీపీ దౌర్జన్యాలను,బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వైసీపీ దౌర్జన్యాలను సెల్ఫోన్లలో రికార్డు చేసి,అధికారులకు,టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని చంద్రబాబు సూచించారు.
రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని... ప్రజల్లో వైసీపీ పట్ల చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతోనే ఎన్నికలకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.టీడీపీ నేతలు సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
నిజానికి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో పంతాలు,పట్టింపులు ఇంత దూరం పోయాక వెనక్కి తగ్గవద్దన్న ఉద్దేశమే తప్ప ఎన్నికలను ఎదుర్కోవడం ద్వారా వైసీపీకి వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చునని అంటున్నారు. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6.30గం. నుంచి మధ్యాహ్నం 4గం. వరకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 25 నుంచి నామినేషన్ల స్వీకరణ,28న నామినేషన్ల పరిశీలన,31న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు.
మరోవైపు ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సోమవారం(జనవరి 22) విచారణకు రానుంది. దానిపై విచారణ జరిగేవరకూ వేచి చూడాలని ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఎస్ఈసీ నిమ్మగడ్డకు లేఖ రాసినప్పటికీ ఆయన దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ప్రభుత్వం,ఉద్యోగ సంఘాలు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని అన్నారు. అంతేకాదు,ఎన్నికల ప్రక్రియకు అడ్డంకులు సృష్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.