చెవిటివాళ్ల ముందు శంఖం ఊదుతున్న చంద్రబాబునాయుడు!!
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారం చేజిక్కించుకునే దిశగా ఎంత వేగంగా తీసుకువెళ్దామని చంద్రబాబు ప్రయత్నిస్తున్నా ఆయనకు తమ్ముళ్ల నుంచి సహకారం కొరవడుతోంది. బాబు నాలుగడుగులు ముందుకు వేస్తే.. తమ్ముళ్లు 40 అడుగులు వెనక్కి వేయడమేకాదు.. వెనక్కి తీసుకుపోతున్నారు. ప్రజలతో మమేకమవ్వాలని, అధికారం చేజక్కించుకోవాలంటే గట్టిగా కష్టపడాలంటూ నాయకులకు బాబు చేస్తున్న హితబోధ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా అవుతోంది.
రూ.కోట్లు ఉంటేనే టీడీపీ టికెట్?
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలోనే కాకుండా పార్టీలోను దుమారం రేపాయి. కురబ సామాజికవర్గానికి చెందిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. కోట్లాది రూపాయలు ఉంటేనే తెలుగుదేశం పార్టీ టికెట్ దొరుకుతుందని, లేదంటే దొరకదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టికెట్ పై ఎవరూ ఆశలు పెట్టుకోవద్దని సూచించారు. అప్పటివరకు పార్టీలోకి రావాలనుకున్న కొందర నాయకులు కూడా పార్థసారధి వ్యాఖ్యలతో మనసు మార్చుకున్నారు.
గత ఎన్నికల్లో ఓటమిపాలైన బీకే
పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం దక్కించుకున్న బీకే గత ఎన్నికల్లో ఓడిపోయారు. అధినేత చంద్రబాబు దగ్గర కూడా ఆయనకు మంచి మార్కులే ఉన్నాయి. ఇటువంటి సమయంలో పార్టీకి ఉపయోగపడాల్సిందిపోయి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు చేస్తుండటంతో పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోను తెలుగుదేశం పార్టీ వివాదాల పుట్టగా మారింది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు హోరాహోరీగా కొట్లాడుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో కూడా ఇంత పోరు లేదు. జేసీ సోదరులతోపాటు హనుమంతరాయచౌదరి తదితరులు చేస్తున్న పనులు తెలుగుదేశం పార్టీకి ఏవిధంగాను ఉపయోగపడలేకపోతున్నాయి.
ఎంత చెప్పినా కుమ్ములాటలు మానుకోవడంలేదు
చంద్రబాబు జిల్లాల్లో పర్యటించినప్పుడు నియోజకవర్గ నాయకులు అప్రమత్తం అవుతున్నారు. పర్యటన ముగిసిన తర్వాత ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. పనితీరు మార్చుకొని ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీని బలోపేతం చేయాలని అధినేత చెబుతున్న మాటలను పెడచెవిన పెడుతున్నారు. ఇటువంటివారందరికీ టికెట్లివ్వాలా? వద్దా? అనే చర్చ టీడీపీలో జరుగుతోంది. పనితీరు బాగోలేకపోతే టికెట్లిచ్చేదని లేదని చంద్రబాబు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. అయినా తెలుగు తమ్ముళ్లు మాత్రం కుమ్ములాటలు మానుకోవడంలేదు. చివరకు చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.