జమిలికి స్కెచ్ రెడీ చేస్తున్న చంద్రబాబు- తిరుపతితోనే మొదలు- శ్రేణులకు సంకేతం
గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయం నుంచి బయటపడేందుకు ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు దీని కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మెజారిటీ, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రభుత్వం మీద భారీస్ధాయిలో పోరాటం చేసే పరిస్ధితి లేదు. విపక్ష పార్టీగా టీడీపీకి ఉన్న పరిమితులే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్ధితి నుంచి బయటపడేందుకు చంద్రబాబు ముందు కనిపిస్తున్న ఏకైక ఆశాదీపం జమిలి ఎన్నికలు. 2022లో ఎట్టి పరిస్ధితుల్లోనూ జమిలి ఎన్నికలు జరిగి తీరుతాయని అంచనా వేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు.
జమిలిపైనే చంద్రబాబు ఆశలు...
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం లోపాయికారీ ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితాతో పాటు ఇతర చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఆదేశాలు అందాయి. దీంతో ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇదే అదనుగా ఏపీ రాజకీయ యవనికపై మరోసారి సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు జమిలి ఎన్నికల జపం చేస్తున్నారు. గతేడాది ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం ఛాయల నుంచి బయట పడాలన్నా, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపాలన్నా, టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలన్నా ప్రస్తుత పరిస్ధితుల్లో జమిలి ఎన్నికలను మించిన మార్గం లేదని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
జమిలికి సిద్ధం కావాలని శ్రేణులకు ఆదేశం
దేశంలో ప్రస్తుతం నలకొన్న పరిస్ధితులను బట్టి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకతను అధిగమించేందుకు జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నట్లు చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే 2022లో జమిలి ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని చంద్రబాబు జోస్యం చెబుతున్నారు. పార్టీ నేతలకు సైతం ప్రతీ మీటింగ్లో ఇదే అంశాన్ని పదే పదే చెబుతున్నారు. జమిలి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతలకు నూరి పోస్తున్నారు. ఏడాదిన్నర కష్టపడితే చాలు జమిలి ఎన్నికల్లో సత్తా చూపవచ్చని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు సూచిస్తున్నారు.
వరుస ఎన్నికలతో టీడీపీ ఖుషీ..
ఏపీలో ప్రస్తుతం స్ధానిక సంస్ధల ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఏ క్షణాన అయినా జరిగే అవకాశం ఉంది. అలాగే త్వరలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది.. ఈ రెండు ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా స్ధానిక పరిస్ధితుల ఆధారంగా జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో క్షేత్రస్ధాయిలో బలమైన క్యాడర్ కలిగిన టీడీపీకి మంచి అవకాశాలు ఉంటాయి. గ్రామాల్లో టీడీపీ పరిస్ధితి గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. దీంతో స్ధానిక పోరులో సత్తా చాటడం ద్వారా తిరుపతి ఎన్నికలకు స్కెచ్ రెడీ చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలా కాకుండా స్ధానిక పోరు ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నందున, ఏకకాలంలో తిరుపతి ఉపఎన్నికకూ టీడీపీ సిద్ధమవుతోంది..
Recommended Video
జమిలికి చంద్రబాబు అనుకూలతలేంటి ?
ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు ఉన్న అనుకూలతలు ఏంటనే చర్చ కూడా రాష్ట్రంలో జరుగుతోంది. గతేడాది ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి టీడీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎన్నికల నాటికి, ఆ తర్వాత కూడా అమరావతి చుట్టూనే తిరిగిన టీడీపీ అజెండా ఇప్పుడిప్పుడే మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని సమస్యలపైనా స్పందిస్తోంది. ఇదే క్రమంలో స్ధానిక పోరులో టీడీపీ చెప్పుకోదగిన స్ధానాలు గెలిస్తే తిరిగి జమిలి ఎన్నికల నాటికి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్దితి వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికలో గెలవడం లేదా గట్టి పోటీ ఇవ్వగలిగినా ఆ పార్టీకి బలమే అన్న వాదన వినిపిస్తోంది.
ఇక అమరావతి విషయంలోనూ బీజేపీ, జనసేన వంటి పార్టీలు తాజాగా మద్దతిస్తుండటం టీడీపీకి ప్లస్ కానుంది. దీంతో జమిలి నాటికి వైసీపీకి వ్యతిరేకంగా మరోసారి కూటమికీ టీడీపీ సిద్ధపడే అవకాశాలూ లేకపోలేదు.