కాలేజీ రోజులు..ఆనాటి స్నేహాలు: చంద్రబాబు గ్రూప్ ఫొటోలు: కుప్పంలో దొరికాయట..!
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత జ్ఙాపకాల్లోకి వెళ్లిపోయారు. తన క్యాంపస్ నాటి మధురానుభూతులను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా చంద్రబాబు తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో నిర్వహించిన పర్యటన సందర్భంగా ఈ రెండు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. కుప్పం నియోజకవర్గం పరిధిలోని కంగుంది గ్రామంలో నివసిస్తోన్న రత్నం అనే వ్యక్తి వాటిని చంద్రబాబుకు అందజేశారు.
కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయంటూ..
ఈ రత్నం ఎవరో కాదు.. చంద్రబాబు క్లాస్మేట్. ఆయన పూర్తి పేరు పీఎస్ మునిరత్నం. ఈ రెండు ఫొటోలనూ చంద్రబాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వాటి చరిత్ర గురించి క్లుప్తంగా రాసుకొచ్చారు. రత్నం తన దగ్గర ఉన్న యూనివర్సిటీలో తమ బ్యాచ్మేట్ ఫోటోలను చూపించారని చంద్రబాబు కామెంట్స్ చేశారు. ఆ ఫొటోలను చూడగానే ఒక్కసారిగా తనకు కాలేజీ రోజులు.. ఆనాటి స్నేహాలు అన్నీ గుర్తొచ్చాయని అన్నారు. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చిందనీ చెప్పుకొచ్చారు.
ఎస్వీ వర్శిటీ పూర్వ విద్యార్థిగా..
చంద్రబాబు నాయుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. యూనివర్శిటీ క్యాంపస్లో చదువుకున్నారు. ఎంఎ ఎకనమిక్స్ స్టూడెంట్. 1973-74లో ఆయన ఎస్వీ యూనివర్శిటీలో ఎంఎ ఎకనమిక్స్ ఫైనల్ ఇయర్ సందర్భంగా క్లాస్మేట్స్, ప్రొఫెసర్లతో కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను మునిరత్నం దగ్గరి నుంచి తీసుకున్నారు. ఎకనమిక్స్ ఫైనల్ ఇయర్ క్లాస్మేట్స్తో కలిసి దిగిన ఫొటోలో చంద్రబాబు ముందు వరుసలో ఎడమ వైపు కూర్చుని కనిపించారు.
క్యాంపస్ ఫ్రెండ్స్ను గుర్తు చేసుకుంటూ..
డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ నారాయణ, డాక్టర్ బీఆర్కే రావు, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ, డాక్టర్ ఎల్ కే నాయుడు, డాక్టర్ సీవీ రెడ్డి, పీఎస్ మునిరత్నం, రఘు తనతో పాటు ఈ ఫొట్లో ఉన్నారని చెప్పుకొచ్చారు చంద్రబాబు. క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన అనంతరం తాను రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపానని, ఫలితంగా వారిని ఎవ్వరినీ తరచూ కలుసుకోలేకపోయాననీ అన్నారు. మునిరత్నాన్ని కలవడంతో ఆ కొరత తీరిందని చంద్రబాబు చెప్పారు. ఈ రెండు ఫొటోలు తనను పాత రోజుల్లోకి తీసుకెళ్లాయని గుర్తు చేసుకున్నారు.
Recommended Video
ప్రజా చైతన్య యాత్రతో కుప్పం ప్రజలతో..
చాలాకాలం తరువాత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన రెండురోజుల పాటు కుప్పంలో గడిపారు. నియోజకవర్గం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించారు. వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. పనిలోపనిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.