స్టీల్ప్లాంట్ భూముల విలువ రూ.2 లక్షల కోట్లు: వాజ్పేయి ప్రభుత్వం ప్రయత్నించినా: చంద్రబాబు లేఖ
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేశారు. అయిదు దశాబ్దాలకు పైగా తెలుగువారితో ముడిపడి ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఇది ఆవిర్భవించిందని, అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం కంటే లాభాల్లోకి తీసుకుని రావడానికి అందుబాటులో గల మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు.
68 గ్రామాల త్యాగాల మీద..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ప్రధానికి లేఖ రాయడానికి చంద్రబాబు భయపడుతున్నారంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుప్పిస్తోన్న విమర్శల మధ్య ఆయన ఆ దిశగా చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు జీవనాడిగా అభివర్ణించారు. దాన్ని సాధించడానికి చేసిన పోరాటంలో పలువురు ప్రాణత్యాగాలను చేశారని చెప్పారు. 68 గ్రామాలకు చెందిన 16 వేల కుటుంబాలు 26 వేల ఎకరాలను ప్లాంట్ నిర్మాణానికి త్యాగం చేశాయని పేర్కొన్నారు. త్యాగాల పునాదుల మీద నిర్మితమైన ఈ ప్లాంట్.. దేశానికే గర్వకారణమని అన్నారు.
సొంతంగా గనులు లేకపోవడం వల్లే..
ఇదివరకు కూడా ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాలొచ్చాయని, దాన్ని లాభాలబాట పట్టించడానికి అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను చంద్రబాబు తన లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం 1,333 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి, ప్లాంట్ను ఆర్థికంగా ఆదుకుందని, ఫలితంగా మళ్లీ లాభాల్లోకి వచ్చిందని చెప్పారు. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని చెప్పారు. స్టీల్ప్లాంట్ భూముల విలువ రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేస్తుందని, దాన్ని ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు తన లేఖలో ప్రధానికి సూచించారు.
మహనీయుల పోరాటాల ఫలితం..
తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, నల్లమల్ల గిరి ప్రసాద్ రావు, టీ నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి అనేకమంది నాయకులు.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను నడిపించారని, దాని ఫలితంగా ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడమంటే తెలుగు ప్రజల మనోభావాలను గాయపర్చినట్టవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యమానికి మద్దతుగా 66 మంది ఎమ్మెల్యేలు. ఏడుమంది ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు.
వాజ్పేయి ప్రభుత్వం ప్రయత్నించినా..
1991 నుంచి 2000 మధ్యకాలంలో విశాఖ స్టీల్ప్లాంట్ 4,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూసిందని, అప్పటి వాజ్పేయి ప్రభుత్వం దాన్ని బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్)కు రెఫర్ చేసిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం వల్ల ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి, ఆదుకుందని చెప్పారు. ప్రైవేటీకరణకు బదులుగా స్టీల్ప్లాంట్ను లాభాల్లోకి తీసుకుని రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సొంత గనులను కేటాయించాలని చంద్రబాబు ప్రధానికి సూచించారు.