వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని: గవర్నర్కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు: శాంతిభధ్రతలపై
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకశక్తులు పరిపాలన సాగిస్తున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్నారంటూ కొంతకాలంగా విమర్శలను గుప్నిస్తోన్న ఆయన.. తాజాగా ఇదే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలను తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు.
ప్రత్యేకించి- అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. కిందటి నెల 24వ తేదీన తాడిపత్రికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన అనుచరులతో కలిసి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా ఉంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పట్టణంలో అశాంతియుత వాతావరణానికి కారణమౌతున్నారని పేర్కొన్నారు.
అధికార పార్టీ నాయకులు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనికి తాడిపత్రి ఉదంతమే ఉదాహరణ అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశపూరకంగా వేధిస్తోందని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలను తీసుకేనేలా చేసి, ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు.
Recommended Video
రాష్ట్రంలో కొందరు పోలీసులు.. అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని, వారి కనుసన్నల్లో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు రెట్టింపు అయ్యాయని చెప్పారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చర్యలు తీసుకునేలా చేయాలని, చట్టసభలపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని కాపాడాలని విజ్ఙప్తి చేశారు.