లోకేష్ పాదయాత్రపై చంద్రబాబు మాస్టర్ స్కెచ్!
పాదయాత్ర ద్వారా నారా లోకేష్ తనను తాను తీర్చిదిద్దుకోవడానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి అవకాశం కలుగుతుందని చంద్రబాబు అంచనా.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు ఆయన నడవబోతున్నారు. తన తండ్రి చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించబోతున్నారు. ఆ సమయానికి దాదాపుగా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉండొచ్చు.
తాను హాజరైతే కోరుకున్న స్థాయిలో ప్రచారం రాదని..
లోకేష్ పాదయాత్ర రోజు ఆయన మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం హాజరవలేదు. ఉద్దేశపూర్వకంగానే యాత్రకు ఆయన దూరంగా ఉన్నారు. తాను హాజరైతే మీడియా ఫోకస్ మొత్తం తనమీద పడి లోకేష్ మీద తక్కువ దృష్టి ఉండటంతోపాటు ప్రచారం కూడా తక్కువ స్థాయిలో ఉంటుందనే కోణంలో ఆయన దూరంగా ఉన్నారు. కానీ యాత్ర ఎక్కడ, ఎలాంటి మలుపులు తీసుకోవాలి? సమస్యలెదురవుతుంటే వాటిని ఎలా పరిష్కరించాలి? వంటివాటికి ఆయన అందుబాటులోనే ఉంటున్నారు.
వ్యక్తిగతంగా ఫోకస్ అవ్వాలని..
నారా లోకేష్ 2014-19 మధ్యకాలంలో తండ్రి చాటు బిడ్డగానే ఉన్నాడు. స్వయం ప్రతిపత్తి కనపడలేదు. మంత్రిగా పనిచేసినప్పటికీ చంద్రబాబునాయుడి ప్రభావమే ఎక్కువగా ఉండి లోకేష్ వ్యక్తిగతంగా ఫోకస్ అవలేదని చంద్రబాబు భావన. అందుకే పాదయాత్ర ద్వారా తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకోవడంతోపాటు పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు వస్తుందని, లోకేష్ నాయకత్వాన్ని అంతర్గతంగా అంగీకరించలేకపోతున్న సీనియర్లు కూడా తమ ఆలోచనను మార్చుకుంటారని చంద్రబాబు భావిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర పూర్తయ్యే సమయానికి దాదాపు 75 శాతం నియోజకవర్గాలకు అభ్యర్థులను పూర్తిచేయడం జరుగుతుంది. అందులో లోకేష్ పాత్ర ఉండాలనేది ఆయన భావన.
40 శాతం యువతకే కేటాయింపు
40 శాతం టికెట్లు యువతకు ఇవ్వాలనే ఆలోచనలో ఉండటంవల్ల ఆ 40 శాతం నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితా, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు, టీడీపీ గెలుపు అవకాశాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, గతంలో ఎదురైన అనుభవాలు, టికెట్ నిరాకరించినందుకు సీనియర్ల నుంచి వ్యక్తమయ్యే వ్యతిరేకత... తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలో ఉన్న యువత అంతా, టికెట్లు ఆశించే నాయకులంతా లోకేష్ తోపాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు. టికెట్ల ఎంపికలో లోకేష్ ప్రభావమే ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో యువతరం నాయకులంతా లోకేష్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పాదయాత్ర ద్వారా ఆయనకు దగ్గరయ్యే అవకాశం ఉండటంతో యువతరమంతా ఆయనతోపాటు పాదం కలుపుతున్నారు. లోకేష్ కు 40 శాతం యువతపై పట్టు చిక్కుతుందా? లేదంటే పూర్తిస్థాయిలో పార్టీపై పట్టు చిక్కుతుందా? అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.