టీడీపీలో వైసీపీ ఫార్ములా: పార్టీ పదవుల్లో వారికే ప్రాధాన్యం: దసరా ముహూర్తం!
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ నుండి మార్పు దిశగా టీడీపీ కసరత్తు చేస్తోంది. తొలి నుండి టీడీపీతో ఉండే సామాజిక వర్గాలు దూరం అవ్వటం పైన ఫోకస్ చేసింది. సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ ద్వారానే జగన్ అంత భారీ మెజార్టీతో గెలిచారని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. దీంతో..తొలుత పార్టీ పదవుల్లోనే జగన్ ఫార్ములా అనుసరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కీలక పదవులను మహిళలు, బడుగు, బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత తెదేపా అనుబంధ సంఘాల నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని పార్టీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారు. పార్టీకి తొలి నుండి అండగా ఉన్న బీసీ వర్గాల్లో తిరిగి ఆదరణ పొందే విధంగా పార్టీలో పదవులు కట్టబెట్టాలని నిర్ణయించారు. విజయ దశమి నుండి మొదలు పెట్టి దశల వారీగా పార్టీని సంస్థాగతంగా మార్పులు చేర్పులతో పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
దసరా నుంచి టీడీపీలో సరికొత్త మార్పులు..
పార్టీ ప్రక్షాళన దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. తొలుత తెదేపా అనుబంధ సంఘాల నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో గత ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాలను తిరిగి దగ్గర చేసుకొనే క్రమంలో భాగంగా.. పార్టీ పదవుల్లో మహిళలు, యువత, బడుగుబలహీన వర్గాలకే కార్యవర్గాలలో ప్రాధాన్యం ఇవ్వాలని అంచానకు వచ్చారు. దీని ద్వారా కింది స్థాయిలో ఉన్న కేడర్ లో జోష్ నింపి.. తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించుకునే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..అనుబంధసంఘాల కార్యవర్గాల ఏర్పాటును ముందుగా ప్రారంభించనున్నారు. టీడీపీ ఎప్పుడూ సెంటిమెంట్ గా భావించే విజయదశమి నుంచి ప్రారంభించి.. నవంబరు నెలాఖరుకు అన్ని అనుబంధ సంఘాల కార్యవర్గాలను ఎన్నుకోనున్నారు.
పార్టీలోనూ సమూల మార్పుల దిశగా..
పార్టీ అనుబంధ సంఘాల ప్రక్షాళన తరువాత తెలుగుదేశం పార్టీలోనూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా ప్రాంతాల వారీగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో సామాజిక సమతుల్యత సరిగ్గా లేని కారణంగానే నష్టం జరిగిందని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. దీంతో..త్వరలో స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని పార్టీ ప్రక్షాళన దిశగా చర్యలు ప్రారంభించారు. అందులో అనుబంధ సంఘాల కార్యవర్గాలలో యువత, మహిళలు, బడుగు, బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు నిర్ణయించిన కీలక సమావేశం లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
చంద్రబాబుతో నేతల భేటి
ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులూ పాల్గొన్నారు. టీడీపీకి పూర్వ వైభవం తేవడానికి ఏం చర్యలు తీసుకోవాలో సమావేశంలో చర్చించారు. పార్టీకి ఉన్న అని అనుబంధ సంఘాలకు నూతన కార్యవర్గాలను నియమించాలని నిర్ణయించారు.
దసరా నుండి ప్రక్షాళన ప్రారంభం..
ఈ ప్రక్రియ దసరాకు ప్రారంభించి నవంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. అనుబంధ సంఘాలలో 33 శాతం యువత, 33 శాతం మహిళలు, 50 శాతం బడుగు.. బలహీనవర్గాల వారికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు. సామాజికవర్గాల జనాభా ఆదారంగా వారికి పదవులలో అవకాశాలు ఇవ్వనున్నారు. అలాగే కార్యవర్గంలోకి ఎన్నికైన వారి పనితీరును నిర్ణీత సమయంలోగా పరిశీలించనున్నారు. పనితీరు బాగాలేని వారిని కార్యవర్గంలోని మెజారిటీ సభ్యుల నిర్ణయంతో రీకాల్ చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా కమిటీల స్థానంలోనే
ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ జిల్లా కమిటీలుగానే ఉండేవి. అయితే ఇకపై పార్లమెంటు స్థానాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. నవంబరు నెలాఖరుకు అన్ని సంఘాల కార్యవర్గాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం పూర్తి చేయనున్నారు. అనుబంధ సంఘాల ప్రక్షాళనతోనే తెలుగుదేశం పార్టీలోనూ కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయి.