మాన్సాస్ వ్యవహారంలో చంద్రబాబు దోషే.. చరిత్ర చెబుతున్న వాస్తవమిదే...
వివాదాస్పద మాన్సాస్ ట్రస్టులో గతంలో రాజకుటుంబీలకు మినహా ఎవరికీ చోటు దక్కలేదా ? పూసపాటి వంశీయుల కన్నుసన్నల్లోనే దశాబ్దాలుగా సాగిన రాజకీయంలో ఇంకెవరూ భాగస్వాములు కాలేదా ? తన హయాంలో మాన్సాస్ ట్రస్టులో చంద్రబాబు ఇతరులకు చోటుు కల్పిస్తుంటే అశోక్ గజపతిరాజు ఎందుకు నోరు మెదపలేదు ? ఇప్పుడు సంచయిత వ్యవహారాన్ని ఆయన తప్పుబట్టడం వెనుక కారణాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మాన్సాస్ ట్రస్టులో రాజవంశీకులు
1958లో ఓ సదుద్దేశంతో ఏర్పాటు చేసిన మహారాజా అలక్ నారాయణ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ట్రస్టు ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి విద్యాదానంతో పాటు మరెన్నో సేవలు చేసింది. వేలాది ఎకరాల ట్రస్టు భూముల గురించి ఇప్పుడు రాజకీయ నేతలు మాట్లాడుతున్నారే కానీ స్ధానికంగా ఉండే ప్రజలకు మాత్రం అదో మినీ యూనివర్శిటీగానే తెలుసు. విద్యాసంస్ధలు, దేవాలయాలతో నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండే మాన్సాస్ ట్రస్టుకు ఆరంభం నుంచి పూసపాటి రాజవంశీకులే అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నారు. మాన్సాస్ కే కాదు దాని పరిధిలో ఉన్న అన్ని ఆలయాలకూ వాళ్లే ధర్మకర్తలు.
మాన్సాస్ బోర్డులో ఎవరెవరు ?
గొప్ప చరిత్ర కలిగిన మాన్సాస్ బోర్డులో పూసపాటి రాజవంశీకులతో పాటు స్ధానిక ప్రజాప్రతినిధులకు కూడా స్ధానం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నిసార్లు రాజకీయ నేతలతో పాటు వారికి సన్నిహితులుగా ఉన్న వారికి కూడా ప్రభుత్వాలు చోటు కల్పించాయి. అయితే అప్పట్లో ట్రస్టు ఛైర్మన్ గా ఉన్నవారికి తెలిసే ఇదంతా జరిగింది. ప్రభుత్వాల మాట కాదనలేక మాన్సాస్ బోర్డులో ఇతరులకు కూడా స్ధానం కల్పించిన సందర్భాలు లేకపోలేదు. అయితే వాటిపై అప్పట్లో ఎవరూ అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఎలాంటి సమస్యా రాలేదు.
2016లో టీడీపీ ఏం చేసింది ?
2016 ఏప్రిల్ నెల 7వ తేదీన అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ఓ జీవో ఇచ్చారు. దీని ప్రకారం మాన్సాస్ ట్రస్టులో తనకు అత్యంత సన్నిహితులైన ఏపీ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీగా ఉన్న ఐవీ రావుకు అందులో చోటు కల్పించారు. అంటే ట్రస్టుతో ఎలాంటి సంబంధం లేని, స్ధానిక రాజకీయ నేతలు కానీ, ప్రజాప్రతినిధులు కాని ఇద్దరు మాన్సాస్ ట్రస్టులో చేరిపోయారు. ఛైర్మన్ స్ధానంలో ఉంటూ అందుకు ప్రత్యక్ష్య సాక్షిగా ఉన్న అశోక్ గజపతిరాజు అప్పట్లో చంద్రబాబు మాటను ఎందుకు కాదనలేకపోయారు అంటే ఎవరి దగ్గరా సమాధానం లేదు.
ఇప్పుడు అశోక్ ఏం చెప్తున్నారు ?
అప్పట్లో తన పార్టీ అధినేత చంద్రబాబు మాట విని ట్రస్టుతో సంబంధం లేని ఇద్దరు వ్యక్తులకు ఇందులో స్ధానం కల్పించిన అశోక్ గజపతిరాజు ఇప్పుడు అన్న కూతురు సంచయిత రాక నేపథ్యంలో రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు. మాన్సాస్ ట్రస్టులో హిందువులు కాని వారికి ఎలా చోటిస్తారని ఓసారి, మహిళలకు చోటివ్వరాదని మరోసారి, రాజకుటుంబానికి సంబంధం లేదంటూ ( గతంలో తాను కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ) ఇంకోసారి అశోక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో అశోక్ కూ, టీడీపీకి ఒకేసారి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ సర్కారు అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.
Recommended Video
అశోక్ అభ్యంతరాలు నిలబడతాయా ?
మాన్సాస్ ట్రస్టుకు నిన్న మొన్నటి వరకూ ఛైర్మన్ గా వ్యవహరించి తాజాగా సంంచయిత రాకతో ఉద్వాసనకు గురైన అశోక్ గజపతి రాజు తాజా పరిణామాలపై చేస్తున్న వ్యాఖ్యలు తుదికంటా నిలబెట్టుకుంటారా అన్న సందేహాలు ఉన్నాయి. సంచైతకు మాన్సాస్ పగ్గాలు అప్పజెప్పడంపై న్యాయపోరాటం చేస్తానంటున్న రాజు గారికి గతంలో జరిగిన తప్పిదాలపై అడిగితే మాత్రం నోరు మెదిపే పరిస్ధితి లేదు. అందుకే సంచయిత నియామకం ప్రభుత్వ ఇష్టమంటూనే అది జరిగిన తీరు సరికాదంటున్నారు. దీనిపై ఆయన న్యాయపోరాటానికి సిద్ధమైతే తాను కూడా సిద్ధమేనంటున్నారు సంచయిత..