కరోనా కట్టడికి జగన్కు చంద్రబాబు సలహాలు- ట్విట్టర్ వీడియో ద్వారా డిమాండ్లు..
అమరావతి : ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు లక్షకు చేరువవుతోంది. మృతుల సంఖ్య కూడా వెయ్యికి దగ్గర్లో ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి ఫలితం మాత్రం నామమాత్రంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు... వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.
కరోనాతో రాష్ట్రంలో దాదాపు ప్రతీ కుటుంబం ఇబ్బంది పడుతోందని, వారికి పది లక్షల చొప్పున ఆర్ధిక భరోసా కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపుల ద్వారా కరోనా విస్తరిస్తోందని, వాటిని తక్షణం మూసివేయాలని కోరారు. కరోనా సోకిన వారికి ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు సరిపోవడం లేదని, అందుకే ఇకపై రోగులను హోం క్వారంటైన్ దిశగా ప్రోత్సహించి అక్కడే టెలీ మెడిసిన్ ద్వారా అవసరమైన సాయం అందించాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. ఇప్పటికే పనిచేస్తున్న కోవిడ్ ఆస్పత్రుల్లో అదనపు బెడ్ల ఏర్పాటుతో పాటు పూర్తి శానిటైజేషన్ చేయాలని కోరారు.
అలాగే ప్రభుత్వం ముందు చంద్రబాబు కొన్ని డిమాండ్లు కూడా ఉంచారు. వీటిలో కరోనా వ్యాప్తి తగ్గేవరకూ ప్రభుత్వం జనాన్ని ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా వారికి కావాల్సిన రేషన్ సరుకులు ఇళ్ల వద్దకే పంపాలన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కరోనా కారణంగా పెరిగిన కరెంటు బిల్లులు కట్టలేక జనం ఇబ్బందులు పడుతున్నారని, పాత బిల్లింగ్ విధానం అమలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా మృతుల అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.
ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతోంది. అలాగే కొన్ని సూచనలు చేస్తోంది. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలి pic.twitter.com/hhr2x8O84I
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 28, 2020
Recommended Video
అలాగే కరోనా కిట్లు, బ్లీచింగ్ పౌడర్, 108 వాహనాల్లో జరిగిన అవినితిపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు, నవంబర్ వరకూ పంపిణీ కోసం కేంద్రం ఇచ్చిన బియ్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. పెంచిన పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలని కూడా చంద్రబాబు తన ట్విట్టర్ వీడియోలో కోరారు. ఇవేవీ గొంతెమ్మ కోర్కెలు కాదని ఆచరణ సాధ్యమైనవేనని చంద్రబాబు తెలిపారు.