సింహం సింగిల్ గానే...వచ్చే ఎన్నికల్లో టిడిపి ఒంటరి పోరు:బుద్దా వెంకన్న
విజయవాడ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోందని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ఆదివారం టిడిపి మహానాడు ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ మహానాడు నుంచే తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని బుద్దా వెంకన్న చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సింహం సింగిల్ గానే వస్తుందని, చంద్రబాబు ఆధ్వర్యంలోని టిడిపి విజయం ఖాయమని బుద్ధా వెంకన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి తిరుగులేదని, చంద్రబాబు నాయకత్వంలో తమ పార్టీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకోనుందన్నారు.
వైసిపి అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయా పార్టీలకు తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.
మరోవైపు టిడిడి మహానాడు-2018 నిర్వహణలో యువతదే కీలక పాత్రని తెలుగుదేశం పార్టీ లోని యువ నేతలు స్పష్టం చేస్తున్నారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల రవి మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుంచి యువతకు మంచి ప్రాధాన్యత ఇచ్చేవారని, అలాగే యువత కూడా పార్టీలో కీలక పాత్ర పోషించేదని చెప్పారు. తమ పార్టీ అధినేత మహానాడుతో సహా పార్టీ కర్యక్రమాల్లో యువతను కమిటీల్లో నియమించేవారని, తద్వారా తాము అనేక విషయాలు నేర్చుకోగలిగేవారిమన్నారు. రాబోయే ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించడం ఖాయమని మరో యువనేత దేవినేని అవినాష్ చెప్పారు.