టీవీ ఆన్ చేయగానే జగన్ ఫొటో- ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు- ఫైబర్ నెట్ కారణం
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెస్వోలను వైసీపీ వాడుకుంటున్న తీరుపై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తుండగా.. తాజాగా ఇదే అంశంపై విపక్ష టీడీపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఎస్ఈసీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా టీవీ స్క్రీన్లపై సీఎం జగన్ బొమ్మను ప్రసారం చేయడాన్ని విపక్ష టీడీపీ తప్పుబట్టింది. దీనికి ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏపీ ఫైబర్ నెట్ కారణమని ఆరోపించింది. వైసీపీ నేత గౌతంరెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏపీ ఫైబర్ నెట్ సాయంతో కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సీఎం బొమ్మను టీవీల్లో ప్రసారం చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
రాష్ట్ర్రవ్యాప్తంగా 10 లక్షల ఫైబర్ నెట్ టీవీ కనెక్షన్లు ఉన్నాయని, వీటిలో టీవీ ఆన్ చేయగానే సీఎం బొమ్మ కనిపించేలా ఏర్పాట్లు చేశారని టీడీపీ ఎస్ఈసీకి రాసిన లేఖలో ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఇలా టీవీల్లో ప్రచారం చేసుకోవడం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడాన్ని టీడీపీ తప్పుబట్టింది. దీనిపై ఎస్ఈసీ స్పందంచి టీవీల్లో సీఎం జగన్ బొమ్మ రాకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు తమ లేఖలో కోరారు.