కృష్ణుడి టిషర్టులని బాలయ్యపై, సాక్షిలో డబ్బులని టిడిపి
ఎపిలో ఎన్నికల సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలు మితిమీరిపోతున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్, కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మలకు టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర రావు, రమేశ్ రాథోడ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం ఈసి కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కమిషనర్లను వారు కలిశారు. అనంతరం నామా విలేకరులతో మాట్లాడారు.
జగన్ పార్టీ విపరీతంగా డబ్బు పంచిపెడుతోందని, కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తోందని, ఇవన్నీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా వారు పట్టించుకోవటం లేదన్నారు. ముఖ్యంగా చిత్తూరు తదితర జిల్లాల్లో ఉదయాన్నే సాక్షి దినపత్రికలో రూ వెయ్యి, రూ రెండు వేల చొప్పున నగదు పెట్టి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ పేపర్ వేయించుకోని ఇళ్లకు కూడా సాక్షి దినపత్రికను పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు.
మీడియా వాహనాల్లోను, అంబులెన్స్ల్లోనూ డబ్బు, మద్యం రవాణా చేస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున కల్తీ సారా, కల్తీ లిక్కర్లను తయారు చేసి ఓటర్లకు పోస్తున్నారని, ఇవి తాగి ఇప్పటికి ఆరుగురు చనిపోయారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కల్తీ మద్యం తాగి మరికొందరికి కళ్లు కనిపించటం లేదని, ఇంకొందరికి కాళ్లు, చేతులు పనిచేయటం లేదన్నారు.