పెద్దారెడ్డి భార్యకు రూ.10వేలంటూ -వైసీపీ తలపొగరు అణిచేస్తాం -తాడిపత్రి ఘటనపై నారా లోకేశ్ ఫైర్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తలెత్తిన తాజా గొడవలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
భార్యపై అనుచిత పోస్టులు: జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి -తాడిపత్రిలో భయానక యుద్ధం
అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియా వేదికగా తనపై, తన భార్యపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారన్న ఆగ్రహంతో తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి జేసీ సోదరుల ఇంటిపై దాడికి దిగారు. దాడి సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో సహాయకులను కేతిరెడ్డి అనుచరులు చితకబాదారు. రెండు రోజుల్లో తాడిపత్రి విడచి వెళ్లకపోతే చంపుతామంటూ బెదిరించారు. అక్కడున్న కార్లను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. ఆలోపే పోలీసులు కూడా జేసీ ఇంటికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. జేసీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై..
రౌడీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి..
వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటిపైనా, కార్యకర్తలపైనా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే, వైసీపీ రౌడీలకు కచ్చితంగా తామే బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
తల పొగరు అణిచేస్తాం
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోకపోతే టీడీపీ శ్రేణులే బుద్ధి చెబుతాయని హెచ్చరించిన నారా లోకేశ్.. సీఎం జగన్ కు కూడా వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నాయకుల ఇళ్లపై దాడి చేసి, కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని, జగన్ గ్యాంగుల తల పొగరు అణచివేస్తామని లోకేశ్ ఘాటు హెచ్చరికలు చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం, అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయమని లోకేశ్ స్పష్టం చేశారు.
పెద్దారెడ్డి భార్యకు రూ.10వేలంటూ..
తాడిపత్రిలో జేసీ, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు ఈనాటివి కావు. అయితే నేతలు నేరుగా ఇళ్లపై దాడికి దిగడం మాత్రం ఇదే తొలిసారి. తన భార్యను ఉద్దేవించి టీడీపీ సోషల్ మీడియా తీవ్ర ప్రచారం చేస్తుండటంతో తట్టుకోలేకే ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటిపై దాడికి వెళ్లినట్లు తెలుస్తోంది. వలీ అనే వ్యక్తి ఓ ఆడియోను సోషల్ మీడియాలో పెట్టారని, ఆ ఆడియోలో కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య.. ఒక ఎడ్లబండి మట్టికి రూ. 10 వేలు వసూలు చేస్తున్నట్లు మాట్లాడుకున్నారని, కేతిరెడ్డి ఆగ్రహానికి ప్రధాన కారణం ఆ ఆడియో వ్యవహారమనని, వలీ జేసీ అనుచరుడు కావడంతో అతని కోసమే జేసీ ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కేసీఆర్ ఇన్నింగ్స్ ముగింపు: 2021లో ముఖ్యమంత్రిగా కేటీఆర్ -బెంగాల్ స్ట్రాటజీతో టీబీజేపీ దూకుడు