TDP Mahanadu 2020: టెక్నాలజీ వాడటంలో దిట్ట .. దేశంలోనే తొలిసారి డిజిటల్ మహానాడు..!
దేశంలోనే తొలిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఆ ఘనతను దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి మహానాడు అతి పెద్ద పండుగ . ఏటా రెండు మూడు రోజులపాటు అత్యంత కోలాహలంగా, అందరూ చర్చించుకునే విధంగా, చాలా అట్టహాసంగా మహానాడు నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు సమూహాలుగా ఒకచోట చేరవద్దు అనే కారణంతో ఈసారి మహానాడును డిజిటల్ మహానాడు 2020 గా నిర్ణయించి రెండు రోజులకే కుదించి నిర్వహించనున్నారు.
Recommended Video
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరుల హల్చల్ .. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఇంటిపై దాడి
సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవటంలో టీడీపీ అందెవేసిన చెయ్యి
తెలుగుదేశం పార్టీ చరిత్రలో తొలిసారిగా ‘వర్చువల్ మహానాడు' జరుగుతోంది. మొదటి నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవడంలో తెలుగుదేశం పార్టీ అందెవేసిన చేయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టెక్నికల్ గా ఉన్న అన్ని అవకాశాలను పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను సైతం టిడిపి విపరీతంగా వాడేస్తుంది అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాక్.
సుమారు 14 వేల మంది జూమ్ యాప్ ద్వారా మహానాడులో పాల్గొనే అవకాశం
దేశంలోనే తొలిసారి జరుగుతున్న డిజిటల్ రాజకీయ సమావేశాలు మహా నాడు సమావేశాలు కావడం ఒక విశేషం. ఇక అవి కూడా తెలుగుదేశం పార్టీనే నిర్వహించడం తెలుగుదేశం పార్టీకి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఇక ఈ మహానాడు డిజిటల్ సమావేశాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్ యాప్ ద్వారా ఇందులో పాల్గొననున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను సైతం వదిలిపెట్టకుండా యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని చూసేలా ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్ లో అన్నీ డిజిటల్ సమావేశాలేనా
ఇది నిజంగా ఒక ప్రయోగం అయినప్పటికీ, ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో చాలా రాజకీయ పార్టీలు బహిరంగ సభలకు బదులుగా, ఇటువంటి డిజిటల్ సమావేశాలను పెట్టే అవకాశం ఉంది. ఒక రాజకీయ పార్టీ ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్లైన్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడంతో ఈ డిజిటల్ సమావేశాలు ఏ విధంగా ఉంటాయి అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
డిజిటల్ సమావేశాలతో ప్రత్యేకత చాటనున్న టీడీపీ మహానాడు
మే 28వ తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి కలిసి వచ్చేలా ప్రతి యేటా నిర్వహించే మహానాడు ఈసారి కూడా డిజిటల్ సమావేశాల ద్వారా నిర్వహించనున్నారు. గతంలో మహానాడు ఎప్పుడు నిర్వహించినా ఒక ప్రత్యేకత ఉండేది . మహానాడు సమావేశాల్లో అద్భుతమైన మెనూ పెట్టి, పక్కా ప్రణాళికతో నిర్వహించిన టిడిపి మహానాడు సభల నిర్వహణతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడు కరోనా కష్టకాలంలో నిర్వహిస్తున్న మహానాడు కూడా అంతే ప్రత్యేకంగా నిలవనుంది.టిడిపి నాయకుల, కార్యకర్తల ఆరోగ్య రక్షణ ను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ ప్లాట్ ఫారం నిర్వహిస్తుండడంవిశేషం.
డిజిటల్ సమావేశాలకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న టీడీపీ
ఇక తెలుగుదేశం పార్టీ ఇదే విషయంపై డిజిటల్ సమావేశంలో పాల్గొనాలని భావించేవారు ఏ విధంగా పాల్గొనవచ్చు అనేది సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు .ఈ నెల 27, 28 తేదీల్లో దేశంలో వినూత్నంగా జూమ్ వెబినార్ ద్వారా నిర్వహించనున్న డిజిటల్ మహానాడు 2020 లో పాల్గొనాలి అనుకునేవారు మీ మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ లో జూమ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కరోనా సమయంలో మహానాడు డిజిటల్ మీటింగ్ రాజకీయ పార్టీలకు దిశా నిర్దేశం చేస్తుందా ?
కరోనా మహమ్మారి ఏపీలో పంజా విసురుతున్న వేళ ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న డిజిటల్ మహానాడులో పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి ఇళ్ల నుంచే పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు కళావెంకటరావు సహా, కొందరు పొలిట్బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు మాత్రం మంగళగిరి సమీపంలోని పార్టీ జాతీయ కార్యాలయం నుంచి మహానాడులో పాల్గొంటారు. మిగిలిన నేతలంతా జూమ్ యాప్ ద్వారా పాల్గొంటారు. ఏదేమైనా అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని జరుగుతున్న అతిపెద్ద రాజకీయ సమావేశం టిడిపి మహానాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది భవిష్యత్ లో అనేక రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేస్తుంది అనటంలో ఎటువంటి అనుమానం లేదు.