బెజవాడ రాజకీయాల్లోకి కేశినేని కూతురు- టీడీపీ మేయర్ అభ్యర్ధిగా ఖరారు
విజయవాడ రాజకీయాల్లో మరో యువ నేత పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటివరకూ విజయవాడలో ఎంపీగా తండ్రి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న కేశినేని నాని కూతురు శ్వేతా చౌదరి ఈసారి కార్పోరేషన్ ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగుతున్నారు. శ్వేతను విజయవాడలోని పదో డివిజన్ నుంచి కార్పోరేటర్ గా టీడీపీ రంగంలోకి దింపబోతోంది. అదే సమయంలో ఆమెను విజయవాడ కార్పోరేషన్ మేయర్ అభ్యర్దిగా కూడా టీడీపీ ప్రకటించింది.
2014లో రాజకీయాల్లోకి..
2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి టీడీపీ తరఫున విజయవా ఎంపీ అభ్యర్ధిత్వం దక్కించుకున్న కేశినేని నానికి ఆశించిన స్ధాయిలో మద్దతు దొరకలేదు. అప్పటికే ప్రజారాజ్యంలో ఎదురైన చేదు అనుభవాలు, ఇతరత్రా కారణాలతో ఒంటరిపోరుకు సిద్ధమైన కేశినేనికి అండగా ప్రచార బాధ్యతలు తీసుకునేందుకు యూఎస్ లో ఉన్న కుమార్తె శ్వేత విజయవాడలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో తొలిసారి తండ్రి తరఫున ప్రచారం నిర్వహించిన శ్వేత.. కేశినేని గెలుపు అనంతరం తిరిగి అమెరికా వెళ్లిపోయారు.
అమెరికా ఎన్నికల్లో హిల్లరీకి మద్దతుగా
2016లో జరిగిన అమెరికా ఎన్నికల్లో హిల్లరీ వర్సెట్ ట్రంప్ పోరు సాగుతున్న తరుణంలో అమెరికాలో తన మిత్రులు, సన్నిహితులతో కలిసి శ్వేత ప్రచార పర్వంలోకి దిగారు. సోషల్ మీడియాతో పాటు తనకున్న పరిచయాలతో హిల్లరీ క్లింటన్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నిక్లలో హిల్లరీ ఓటమిపాలైనా శ్వేత ప్రచారం ఆమెకు డెమోక్రాట్ వర్గాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె తిరిగి ఇండియా వచ్చేశారు.
2019 ఎన్నికలే టార్గెట్ గా ప్రచారం
2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్ధానం నుంచి తండ్రి కేశినేని నానిని గెలిపించేందుకు వీలుగా ముందుగానే ఇండియా చేరుకున్న శ్వేత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అప్పటికే టాటా ట్రస్ట్ తరఫున నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్న తండ్రి కేశినేని అండగా నిలిచారు. టాటా ట్రస్ట్ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే కాకుండా తండ్రికి మంచి పేరు తెచ్చారు. దీంతో ఆమెను 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ప్రచార బాధ్యతలను టీడీపీ అప్పగించింది.
జలీల్ ఖాన్ కుమార్తెకు మద్దతుగా...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అప్పటికే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జలీల్ ఖాన్ కు బదులుగా టీడీపీ ఆయన కుమార్తె షబానాను ఎమ్మెల్యే బరిలోకి దింపింది. దీంతో షబానాను గెలిపించుకునేందుకు శ్వేత తీవ్రంగా శ్రమించారు. ఓవైపు షబానా గెలుపు, మరోవైపు ఎంపీ సీటులో తండ్రి కేశినేని గెలుపు.. ఈ రెండు టార్గెట్ లను భుజాన వేసుకున్న శ్వేత కు పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి అసంతృప్తికి గురిచేసినా తండ్రి కేశినేని మాత్రం స్వల్ప తేడాతో గట్టెక్కడం ఊరటనిచ్చింది.
Recommended Video
తొలిసారి ఎన్నికల బరిలోకి..
ఎన్నికల వ్యవహారాల్లో అనుభవం ఉన్న శ్వేతను ఈసారి నేరుగా రంగంలోకి దింపాలని భావించిన కేశినేని నాని చంద్రబాబు వద్దకు తన ప్రతిపాదనను తీసుకెళ్లగా ఆయన కూడా అంగీకరించారు. దీంతో త్వరలో జరిగే పురపాలక పోరులో విజయవాడలోని పదో డివిజన్ నుంచి ఆమెను కార్పోరేటర్ గా బరిలోకి దింపడంతో పాటు మేయర్ అభ్యర్ధిగా కూడా ఖరారు చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో కార్పోరేటర్ తో పాటు మేయర్ గానూ శ్వేత గెలుపు నల్లేరుపై నడక అవుతుందనేది పరిశీలకుల అంచనా.