ఏపిలో కాంగ్రెస్ టీడిపి పొత్తు సాధ్యమేనా..!!
Recommended Video
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని, శాశ్వత శత్రువులు గాని ఉండరు. అనేక సందర్బాల్లో ఈ విషయం రుజువైంది కూడా.. నిన్నటి వరకు బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు 2019 సాధారణ ఎన్నికల్లో స్నేహగీతం పాడబోతున్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం,కాంగ్రెస్ పొత్తుపైన ఆసక్తికరమైన చర్చ రంభమైంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఊపందుకుంది.
కేంద్రంలో జాతీయ పార్టీ అండ కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్ తో దోస్తీ చేయడం ఖాయమన్న రీతిలో వార్తలు వస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం అయ్యే సూచనలు లేకపోవడంతో తెలుగుదేశం తన చిరకాల ప్రత్యర్థిని మిత్రుడిగా మార్చుకుంటుందని చెపుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు ప్రారంభించినట్లు జగన్ టీం ప్రచారం చేస్తోంది. అభ్యర్థుల విషయంలో కూడా కాంగ్రెస్,టీడీపీలు సమాలోచనలు మొదలుపెట్టారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
ఏపిలో టీడిపి కాంగ్రెస్ పొత్తు పై ఆసక్తికర చర్చ..జట్టు కట్టడం సాధ్యమేనా..??
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్,టీడీపీ పొత్తు సాధ్యమేనా...? చంద్రబాబు రాహుతో చేతులు కలపడం జరిగే పనేనా..? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.టీడీపీ ఎన్డీఎ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రాణ స్నేహితులుగా కనిపించిన తెలుగుదేశం,బీజేపీ ఇప్పుడు కత్తులు నూరుతున్నాయి.
ప్రధాని మోదీపైన చంద్రబాబు ఒంటికాలిపైన లేస్తున్నారు.ప్రతి సందర్భంలోనూ ఎపీ సి.ఎం బీజేపీపైన నిప్పులు చెరుగుతున్నారు.టీడీపీ,బీజేపీ నాయకుల మధ్య మాటల మంటలు పడుతున్నాయి. పరస్పరం దాడులు కూడా జరుగుతుండటంతో రెండు పార్టీ బద్ద శత్రువులుగా మారిపోయాయి. విచిత్రంగా బీజేపీపైన పోరాటంలో తెలుగుదేశం ఇప్పుడు ముందుంది. వైసీపీ,జనసేన లాంటి పార్టీలు మోదీపైన పెద్దగా నోరు విప్పకపోవడంతో టీడీపీకి విశ్వసనీయత పెరుగుతోంది.
ఏపికి బీజెపి చేయని మేలు కాంగ్రెస్ చేస్తుందా..??
వచ్చే ఎన్నికల్లో తమకు 25 లోక్ సభ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చంద్రబాబు పదే పదే చెపుతున్నారు. ప్రధాని మంత్రిగా ఎవరు ఉండాలన్నది టీడీపీనే నిర్ణయిస్తుందని మంత్రి లోకేష్ అంటున్నారు. అంటే థర్డ్ ఫ్రంట్ ఆలోచన చంద్రబాబుకు ఉందన్న విషయం అర్థమౌతోంది. అయితే ఈ ఫ్రంట్ ఎన్నికలకు ముందు ఏర్పడుతుందా లేక ఫలితాల తర్వాతనా అన్నది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ఫ్రంట్ లో కాంగ్రెస్ లో ఉంటుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ఫ్రంట్ లో కీలక భాగస్వాములుగా ఉంటాయని భావిస్తున్న తెలుగుదేశం, బీజు జనతా దళ్,సిపిఎం,ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు. దీంతో కాంగ్రెస్ ముందస్తు పొత్తులు ఉండే సూచనలు ఎంత మాత్రం కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండొచ్చు.కాంగ్రెస్ తో నేరుగా పొత్తుకు టీడీపీ సుముఖత వ్యక్తపరచక ర్చకపోవచ్చు.
పరస్పర విరుద్ద శత్రువుల మద్య స్నేహాన్ని ఏపి ప్రజలు స్వాగతిస్తారా..?
నిజానికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాదాపు ముపై యేళ్ల పాటు ఈ రెండు పార్టీలు నేరుగా తలపడ్డాయి. అయితే రాష్ట్ర విభజనతో ఎపీలో కాంగ్రెస్ గల్లంతైంది. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో పుట్టుకొచ్చిన వైసీపీ ఇప్పుడు టీడీపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. తాజాాగా పవన్ కళ్యాణ్ జనసేన కూడా రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయింది.
మరో వైపు ఎపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందన్న భావన రాష్ట్ర ప్రజల్లో నాటుకుపోయింది. విభజన చేసిన కాంగ్రెస్ కంటే మోసం చేసిన భారతీయ జనతా పార్టీపైన ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. మరో వైపు కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే తక్షణమే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం బల్లగుద్ది చెపుతోంది. ఫలితంగా తెలుగుదేశం, కాంగ్రెస్ స్నేహాంపైన చర్చ ప్రారంభమైంది.
ఏపిలో పాత నేతల చేరిక కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం..
అయితే ఎపీలో కాంగ్రెస్ బలం నామ మాత్రమే. గత ఎన్నికలతో పోల్చితే ఒకటి రెండు శాతానికి మించి ఆ పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు. బలమైన నాయకత్వం ఉన్న చోట మాత్రమే ఆ పార్టీ రేసులో ఉండొచ్చు.ఈ స్థానాల సంఖ్య ఇరవై వరకు ఉండొచ్చు.ఒకటి లేదా రెండు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ వచ్చే ఛాన్స్ ఉంది.మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఆ పార్టీలో చేరితే కొంత ఉత్సాహం రావొచ్చు.అయినప్పటికి కాంగ్రెస్ తో ముందస్తు పొత్తుకు చంద్రబాబు ఆసక్తి చూపించే అవకాశాలు లేవు.
అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిగా బరిలోకి దిగాల్సి ఉంటుంది.ప్రభుత్వ సంక్షేమ,అభివ్రుద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం ఎపీ ప్రజలు తమ వెంట ఉంటారన్న నమ్మకంతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్లనున్నారు.ఇదే సమయంలో వైసీపీ, జనసేన,కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తనకు మార్గం సుగమమౌతుందన్నది బాబు అంచనా. మరి ఎన్నికల సమయానికి ఏ పరిణామం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.