సిగ్గుతో రాజీనామా చేస్తున్నా.. అనంతలో టీడీపీ నేత రాజీనామా
ఇలాంటి కౌన్సిల్ లో ఉన్నందుకు సిగ్గు పడుతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కు అందజేసినట్లు చెప్పుకొచ్చారు.
కదిరి: అధికారుల పనితీరుపై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ కదిరి మున్సిపాలిటీకి చెందిన టీడీపీ కౌన్సిలర్ బి.చంద్రశేఖర్ రాజీనామా చేశారు. శుక్రవారం నాడు ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా విషయం చెప్పారు.
తాను తెలుగుదేశం పార్టీ తరపున గత మున్సిపల్ ఎన్నికల్లో 36వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచానని చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేందుకు శ్రమించానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రభుత్వం మున్సిపాలిటీకి రూ.380కోట్లు కేటాయించిందని, అయితే ఆ నిధులను ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్, డీఈ కుమ్మక్కై నిధులను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 36వ వార్డులో 400మంది ఎస్టీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ఇలాంటి కౌన్సిల్ లో ఉన్నందుకు సిగ్గు పడుతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కు అందజేసినట్లు చెప్పుకొచ్చారు.