టీడీపీ నేతపై హత్యాయత్నం: కారుతో వెంటాడి ఢీకొట్టారు, నిందితులు వీరే!
అమరావతి: గుంటూరు జిల్లాలో కలకలం రేగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతను హత్య చేసేందుకు యత్నించారు. ఒంటరిగా బైక్పై వెళుతున్న సదరు టీడీపీ నేతను వెంటాడి మరీ కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ హోదాలో ఉన్న టీడీపీ నేత బాబురావును శుక్రవారం ఆయన ప్రత్యర్థులు వెంటాడి హత్య చేసేందుకు యత్నించారు. ఫిరంగిపురం కార్మెల్ మాతా ఉత్సవాలకు వెళ్లి శుక్రవారం రాత్రి ఒంటరిగా బైక్పై తరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఫిరంగిపురం వద్దే ఆయనను హత్య చేసేందుకు యత్నించినప్పటికీ బాబురావు చాకచక్యంగా తప్పించుకున్నారు. ఆయితే బాబూరావుని ఎలాగైనా హత్య చేయాలన్న తలంపుతో ఆయన బైకును దండగులు కారులో వెంబడించారు. ఈ క్రమంలో నరసరావుపేట సమీపంలోని ఓ గ్రామం వద్ద ఆయన బైకును కారుతో ఢీకొట్టారు.
దీంతో బాబూరావు కిందపడిపోయాడు. దీంతో అతడు చనిపోయాడనుకుని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాబురావు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాబురావును ఆసుపత్రికి తరలించారు.
దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి బాబురావును పరామర్శించారు. ఈ ఘటనపై శనివారం ఉదయం బాబూరావు మీడియాతో మాట్లాడారు. కార్మెల్ మాతా ఉత్సవాలకు వెళ్లి తిరిగి వస్తుండగా సాతులూరు నుంచి కొందరు దుండగులు తనను వెంబడించారని ఆయన తెలిపారు.
ఏపీ07సీక్యూ 1449 వాహనంలో కొందరు దుండగులు నా వెంటపడ్డారని ఆయన చెప్పారు. ప్రాణభయంతో బైక్పై జొన్నగడ్డకు చేరుకున్నానని చెప్పారు. అక్కడ బైకును కారుతో ఢీ కొట్టారు. కిందపడిన అతడిని కొందరు దుండగులు వచ్చి తీవ్రంగా గాయపరిచారని చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఘనటలో దరువూరి బాబు, సుండు అనిల్ కుమార్, వంకాయలపాడు చంద్ర వీరితో పాటు మొత్తం 10 నుంచి 15 మంది తనపై దాడిచేశారని బాధిత నేత పేర్కొన్నారు. తనపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కౌన్సిలర్ బాబూరావు డిమాండ్ చేస్తున్నారు.
గత కొద్దిరోజుల క్రితం జరిగిన కేబుల్ గొడవ కారణంగానే తనపై ఈ దాడికి పాల్పడినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.