టీడీపీకి బీజేపీ డోర్లు క్లోజ్: అమిత్ షాకు టీడీపీ గట్టి కౌంటర్, జగన్కు డబ్బివ్వడం ఇష్టంలేదు
అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సరికాదని తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు. కుటుంబం లేని నరేంద్ర మోడీ చేతుల్లో దేశం మొత్తం నలిగిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ చెంతకు వెళ్లే అవకాశమే లేదు
ఏపీకి ఎంతో చేశామని అమిత్ షా చెబుతున్నారని, కానీ ఏపీకి ఎంత ఇచ్చారో, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎంత ఇచ్చారో చెప్పాలని యనమల నిలదీశారు. విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించిందా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ తిరిగి బీజేపీ చెంతకు చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల తర్వాత టీడీపీ మళ్లీ తమ చెంతకు వస్తుందని, కానీ తాము మాత్రం డోర్లు క్లోజ్ చేశామని అమిత్ షా చెప్పారు. చంద్రబాబు తమ వద్దకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిపై యనమల కౌంటర్ ఇచ్చారు.
డబ్బులివ్వడం జగన్కు ఇష్టం లేదు
పేదలకు డబ్బులు ఇవ్వవద్దు అనే రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పేదలకు డబ్బులిస్తే జగన్ ఓర్చుకోలేకపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు. టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూడలేకే కులపరమైన కామెంట్లు చేస్తున్నారన్నారు.
అమిత్ షాపై లోకేష్ నిప్పులు
జగన్ పైన ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా నిప్పులు చెరిగారు. కియా పైన వైసీపీ ధర్నా జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్ వస్తే అడవులు మాయమవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ బుద్ధి చూపిస్తున్న జగన్కు ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. అమిత్ షా పైన కూడా లోకేష్ నిప్పులు చెరిగారు. 'రాయలసీమ పై కపట ప్రేమ వద్దు షా జీ. తరాలుగా కలగా మిగిలిన జలాలు వచ్చాయి. పొలాలు తడిశాయి. కియా వచ్చింది. ఉద్యోగాలు తెచ్చింది. పరిశ్రమలు వచ్చాయి. ఉపాధిని పెంచాయి.
రాయలేలిన సీమ..కోనసీమగా కనిపిస్తోంది. కేంద్రం కుదరదు అన్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం.', 'మీ డిక్లరేషన్ రాజకీయాలకు ప్రజలే సమాధానం చెప్పబోతున్నారు. వెయిట్ అండ్ సి షా జీ' అని పేర్కొన్నారు.