ఎన్నికల ఫలితం తేలిపోయిందా: అందుకేనా..మహానాడు రద్దు: 2014లో ఏం చేసారు .!
టీడీపీలో కీలక నిర్ణయం. ఈ సారి పసుపు పండుగ లేదు. ప్రతీ సంవత్సరం నిర్వహించే టీడీపీ పండుగ మహానాడును ఈ సారి నిర్వహించటం లేదు. కేవలం ఎన్టీఆర్ జన్మదినం వేడుకలను మాత్రం ప్రతీ చోట నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్నికల ఫలితాలు..రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, అంతర్గతంగా మాత్రం జరుగుతున్న చర్చ మరో విధంగా ఉంది..
మహానాడు రద్దుకు టీడీపీ నిర్ణయం..
ప్రతీ ఏటా టీడీపీ అధికారంలో ఉన్నా..లేకున్న పార్టీ పండుగ అయిన మహానాడును ఘనంగా నిర్వహించం ఆనవాయితీ. ప్రతీ ఏడాది ఎన్టీఆర్ జన్మదినం అయిన మే 28 తో పాటుగా ముందు రోజు..తరువాతి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. అయితే, ఈ సారి మాత్రం మహానాడు గురించి ఇప్పటి వరకు చర్చ కూడా జరపలేదు. కేబినెట్ సమావేశానికి అమరావతికి మంత్రులు రావటంతో..దీని పైన పార్టీ అధినేత చర్చించారు. మే 23న ఎన్నికల ఫలితాలు రాకవటం.. ఆ వెంటనే రాష్ట్రంతో పాటుగా జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని.. ఆ సమయంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని టీడీపీ ముఖ్యులు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ఈ సారి మహానాడు వేడుకలను మే 23న ఫలితాల కారణంగా రద్దు చేసుకొని కేవలం ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఫలితాలు అడ్డుగా మారాయా..
మే 23న ఎన్నికల ఫలితాలు మహానాడు నిర్వహణకు అడ్డుగా మారుతున్నాయని పార్టీ చేస్తున్న వాదన పైన కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు మే23న వెల్లడి అవుతాయి. ఆ తరువాత కూడా నాలుగు రోజుల సమయం ఉంటుంది. ఈ లోగా ప్రతీ ఏడాది మాదిరే కమిటీలు ఏర్పాటు చేస్తే..వారంతా ఎన్నికల్లో పోటీలో ఉన్నవారు కాదు.ఏర్పాట్లు పూర్తి చేసుకుంటే..మే 28న ఎన్టీఆర్ జన్మదినం నాడే నిజంగా అంచనా వేస్తున్నట్లుగా ఎన్నికల్లో గెలిస్తే ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకోవచ్చని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే, జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటామని చెబుతూ..మహానాడును రద్దు చేసారు. గతంలోనూ మూడు సందర్భాల్లో ఇలా మహానాడును పరిమితం చేసుకొని కేవలం ఒక్క రోజు మాత్రమే నిర్వహించిన సందర్భాలను పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
2014లో ఏం చేసారంటే..
2014లోనూ ఎన్నికలు జరిగాయి. అప్పుడూ మే రెండో వారం అంటే మే16 న ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలు రాకముందే మహానాడు కమిటీలు ఏర్పాటు చేసారు. మే 16న ఫలితాలు రాగా..మే 26న కేంద్రంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసారు. ఆ కార్యక్రమానికి చంద్రబాబు సైతం హాజరయ్యారు. ఆ తరువాతి రోజు నుండే మూడు రోజుల పాటు మహానాడు హైదరాబాద్లో జరిగింది. ఆ తరువాత జూన్8న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. ఆ సమయంలోనూ ఎన్డీఏ భాగస్వామపక్ష పార్టీగా టీడీపీ వ్యవహరించింది. అయితే, ఇప్పుడు ఎన్నికల ఫలితాల పైన పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..లోపల ఏమైనా అనుమానం ఉందా..అందుకే కీలకమైన మహానాడు విషయంలోనూ నిర్ణయం వాయిదా వేసుకుంటున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి.