సీఎం జగన్ పై టీడీపి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు: నా నోట ఆ మాట రాలేదు: బాస్టర్డ్ పదం పై చంద్రబాబు..!
ముఖ్యమంత్రి జగన్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు మార్షల్స్ ను బాస్టర్డ్ అంటూ దూషించారని..సభలో ముఖ్యమంత్రి ఆరోపించటం పైన టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు శాసనసభలోని తన కార్యాలయంలో మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. తాను అన్న పదం నో కొశ్చన్ అనే పదాన్ని..బాస్టడ్ అనే విధంగా చిత్రీకరించారని ఆరోపించారు. లేని దాన్ని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించారని ఆరోపించారు. మూడు గంటల పాటు తాను అనని పదాన్ని అన్నట్లుగా చిత్రీకరించిన ముఖ్యమంత్రి జగన్ పైన ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రభుత్వ చర్చ దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
సీఎం పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు..
ఏపీ శాసనసభలోని గురువారం టీడీపీ నేతలు ప్రవేశించే సమయంలో అక్కడ మార్షల్స్ తో ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో తమను లోపలకు వచ్చే సమయంలో అడ్డుకోవటం పైన మార్షల్స్ పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే విషయం పైన సభలో రచ్చ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రభుత్వం సభలో ప్రదర్శించింది.
ముఖ్యమంత్రి జగన్ ఏకంగా చంద్రబాబు ప్రభుత్వ అధికారిని బాస్టర్డ్ అని దూషించారని..ఇది ప్రభుత్వ ఉద్యోగులను అవమానించటమేనని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని..లేకుంటే ఆయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఈ అంశం మీద తీర్మానం ప్రతిపాదించింది. అసెంబ్లీ మార్షల్స్ మీద అమర్యాదగా వ్యవహరించిన వారి పైన చర్యలు తీసుకొనే అధికారం స్పీకర్ కు అప్పగిస్తూ మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రతిపాదించగా..వైసీపీ సభ్యులు ఆమోదించారు. దీని పైన చంద్రబాబు వివరణ ఇచ్చారు. అది కల్పితమని కొట్టిపారేసారు. ఈ అంశంలో సీఎం పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు.
మూడు గంటలు సభలో అబద్దాలు చెప్పారు..
సభలో జరిగిన తీరు పైన చంద్రబాబు మండిపడ్డారు. తాను అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరించి..ప్రసారం చేసారని దుయ్యబట్టారు. అదే సమయంలో లోకేశ్ సైతం ఒక మార్షల్ గొంతు పట్టుకున్నట్లుగా వీడీయోలో కనిపించింది. ఇక, మరి కొందరు టీడీపీ నేతలు మార్షల్స్ పైన దాడి చేసారంటూ ప్రభుత్వం వీడియోతో పాటుగా ఫొటోలు ప్రదర్శించంది.
చంద్రబాబు పెద్దరికంగా క్షమాపణ కోరాలని ప్రభుత్వంతో పాటుగా స్పీకర్ సైతం సూచించారు. అయితే, చంద్రబాబు తనకు జరిగిన అవమానం పైన ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలని..ఆ తరువాత తాను స్పందిస్తానని స్పష్టం చేసారు. ఇక, దీని మీద చంద్రబాబు అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో జరిగింది వివరించారు.ప్రభుత్వ చర్య దుర్మార్గమన్నారు. ఇది ఖచ్చితంగా ఉన్మాది చర్య అంటూ మండిపడ్డారు.
నా నోటి నుండి బూతులు రావు..
ఇదే అంశం మీద చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకూడదా అని ప్రశ్నించారు.వాళ్లు ఏమైనా దొంగలా అని నిలదీసారు. తన నోటి నుండి ఎప్పుడూ బూతులు రావని..ఏదయినా కోపం వస్తే గట్టిగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. దీని కారణంగానే సభను తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సభా సమయం వేస్ట్ చేసేలా అనని మాటలు అన్నానని చెబుతూ మూడు గంటల పాటు సభలో హంగామా చేసారని చంద్రబాబు దుయ్యబట్టారు.