ఏం చేద్దాం? పార్టీ నేతలతో బాబు భేటీ, త్వరలోనే నిరుద్యోగ భృతి, బస్సు యాత్ర
Recommended Video
అమరావతి: ప్రత్యేక హోదా విషయమై పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా టిడిపి వ్యూహ రచన చేసింది.ఈ మేరకు ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. మరో వైపు పార్టీ అధికార ప్రతినిధులతో టిడిపి వ్యూహ కమిటీ మంగళవారం నాడు అమరావతిలో సమావేశం కానుంది. జిల్లా స్థాయిలో కూడ ప్రత్యేక హోదాపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. నియోజకవర్గాల వారీగా సైకిల్ ర్యాలీలు చేపట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు సూచించారు. న్యూఢిల్లీలో ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.
టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా విషయమై చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. మరోవైపు టిడిపి వ్యూహ కమిటీ సభ్యులతో బాబు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై దశ దిశను నిర్ధేశించారు.
ప్రత్యేక హోదా విషయమై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ఈ విషయమై తామే ఛాంపియన్గా నిలిచేందుకు అవసరమైన వ్యూహన్ని రచించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మూడు రోజుల్లోపే ఎంపీల బస్సుయాత్ర
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఢిల్లీలో ఎంపీలు చేసిన ఆందోళన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు కేంద్రం ఏ రకంగా తమను ఇబ్బందులకు గురిచేసిందనే విషయాలను ప్రజలకు వివరిస్తూ బస్సు యాత్ర సాగనుంది. ఆత్మగౌరవ యాత్ర పేరుతో ఈ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. మూడు రోజుల్లోపుగానే బస్సు యాత్ర ప్రారంభించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.ప్రత్యేక హోదా సాధన కోసం న్యూఢిల్లీలో ఎంపీలు చేసిన పోరాటాన్ని బాబు ప్రశంసలతో ముంచెత్తారు. జాతీయ స్థాయిలో ఎంపీల పోరాటం అందరి దృష్టిని ఆకర్షించిందని బాబు పార్టీ నేతల సమావేశంలో అభిప్రాయపడ్డారు.
సైకిల్ ర్యాలీలు
జిల్లాల్లో కూడ అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని టిడిపి నేతలు నిర్ణయానికి వచ్చారు. జిల్లాల్లో కూడ హోదా పోరులో భాగంగా మేధావులు, వివిధ సంఘాలతో జిల్లాల వారీగా అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదాపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై కూడ చర్చించనున్నారు. మరోవైపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ సైకిల్ ర్యాలీలు చేపట్టాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.
నిరుద్యోగ భృతి అమలుకు రంగం సిద్దం
రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని టిడిపి వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి అర్హులైన వారందరికీ ఈ భృతిని అమలు చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఈ మేరకు నిరుద్యోగులకు టిడిపి హమీలను ఇచ్చింది. అయితే ఈ హమీని అమలు చేసే ప్రక్రియలో ఆలస్యం జరిగింది. దీంతో వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని వ్యూహకమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.ఈ పథకానికి తోడుగా అన్న క్యాంటీన్లను కూడ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కేంద్రంతో కుమ్మక్కై నష్టం
రాష్ట్రంలోని కొన్ని పార్టీలు కేంద్రంతో కుమ్మకై రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి వ్యూహ కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు.టిడిపిని దెబ్బతీయాలనే లక్ష్యంతో కేంద్రంతో ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన చెప్పారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.