నంద్యాలలో అసమర్థుడి జీవయాత్ర.. జనమెవరూ సిద్దంగా లేరు: బాబుపై భూమన సెటైర్స్
జగన్ ప్రచారం జైత్రయాత్రలా సాగుతుంటే.. చంద్రబాబు ప్రచారం మాత్రం జీవ యాత్రలా సాగుతోందని భూమన ఎద్దేవా చేశారు.
కర్నూలు: నంద్యాల ఓటర్లంతా వైసీపీకే ఓటేయాలని నిశ్చయించుకున్న తరుణంలో.. ఓ అసమర్థుడి జీవ యాత్ర కాసేపట్లో ప్రారంభం కాబోతోందంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేత భూమన విమర్శించారు. చంద్రబాబు చెప్పే దొంగ మాటలను నమ్మడానికి నంద్యాల ప్రజలు సిద్దంగా లేరని, చివరకు టీడీపీకి మిగిలేదని ఓటమేనని వ్యాఖ్యానించారు.
పోలీసులకు కూడా టీడీపీ నేతలు కమిషన్లు ఇస్తున్నారని, అందువల్లే వారి ఆగడాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సంఘం కూడా టీడీపీ అక్రమాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీకి చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు పంచలేదని, డబ్బులు పంచుతున్నారని లేని ఆరోపణలు సృష్టించి అన్యాయంగా తమ కార్యకర్తలైన కొందరిని అరెస్ట్ చేశారని ఆరోపించారు.
నంద్యాల ఉపఎన్నిక కోసం వందల కోట్లను వెదజల్లుతున్న టీడీపీ.. మన దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఈ ఎన్నికను మార్చివేసిందని విమర్శించారు. జగన్ ప్రచారం జైత్రయాత్రలా సాగుతుంటే.. చంద్రబాబు ప్రచారం మాత్రం జీవ యాత్రలా సాగుతోందని భూమన ఎద్దేవా చేశారు.
నంద్యాలలో తమ నాయకుడు జగన్ జైత్రయాత్ర 11వ రోజుకు చేరుకుందని.. ఈ ప్రచార కార్యక్రమంతో నంద్యాల ప్రజల గుండెల్లో జగన్ సుస్థిర స్థానం దక్కించుకున్నారని చెప్పారు.