సమీక్షల్లో బీజీ .. బీజీ .. టీడీపీ నేతల ఆరోపణలు లైట్ తీసుకుంటున్న ఎల్వీ! టచ్లో ఉన్న ఆ ఇద్దరు !
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలకు దూరమయ్యారు. కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం తన పైన టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను పట్టించుకోవటం లేదు. తన సమీక్షల్లో..అధికారిక విధుల్లో బిజీగా ఉన్నారు. అయితే, సీఎస్ ప్రధానంగా ఆర్దిక శాఖ పైన దృష్టి సారించారు. నిధుల విడుదల పైనా ఆరా తీస్తున్నారు. దీంతో..టిడిపి నేతలకు సమీక్షలకు అవకాశం ఇవ్వటం లేదనే ఆవేదనా..లేక సీయస్ నిర్ణయాల పైన ఆందోళనా పట్టుకుందా అనే చర్చ మొదలైంది.
కొనసాగుతున్న ఎల్వీ జోరు..
ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రమణ్యం పైన టిడిపి నేతలు ప్రతీ రోజు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు. దొడ్డి దారిన వచ్చిన సీఎస్ అంటూ ఆరోపిస్తున్నారు. సీఎంకు లేని అధికారం సీఎస్కు ఉంటుందా అని నిలదీస్తున్నారు. అయితే, వీటికి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం స్పందించటం లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. ఒక వైపు కోడ్ కారణంతో ముఖ్యమంత్రి సమీక్షలకు దూరం కాగా..సీఎస్ మాత్రం సమీక్షలతో బిజీగా ఉన్నారు. తాజాగా, అటవీ శాఖ పైనా సమీక్ష చేసారు. ఏపి పైన తుఫాను ప్రభావం పైనా ఆరా తీసారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఏపిలో ఇసుక దోపిడీ పైనా కీలక చర్చలు చేస్తున్నారు. తనకు కావాల్సిన సమాచారం అందించాలని కీలకమైన 14 శాఖల అధికారులకు లేఖలు రాసారు. ఇక, తన రోజు వారీ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు.
ఆ ఇద్దరితో టచ్లో ఉన్నారు..
ఇక, ఇదే సమయంలో టిడిపి నేతలు ఎల్వీ సుబ్రమణ్యం పైన తీవ్ర విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు సీయస్ పూర్తిగా కేంద్రలోని బిజెపి నేతల కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించిన టిడిపి నేతలు ఈ రోజు మరో ఆరోపణ చేసారు. సీఎస్గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని వెంటనే తొలగించాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఎమ్మార్ కేసులో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏ-11 నిందితుడుగా ఉన్నాడని, ఆయనను సీఎస్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. అర్హత లేని వ్యక్తిని సీఎస్గా నియమించిందని ఈసీ తీరును తప్పుపట్టారు. నైతిక విలువలు ఉంటే ఎల్వీ సుబ్రహ్మణ్యం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజు ఫోన్లో జగన్, విజయసాయి రెడ్డితో ఎల్వీ సుబ్రహ్మణ్యం టచ్లో ఉంటున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.
ఆవేదనా..ఆందోళనా
టిడిపి నేతలు ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారంటూ బిజెపి..వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. సమీక్షలు నిర్వహించటం లేదనే ఆవేదనలో టిడిపి నేతలు మాట్లాడుతున్నారా లేక ఎల్వీ సుబ్రమణ్యం లోతైన సమీక్షలతో వాస్తవాలను బయటకు తీస్తున్నారనే ఆందోళనలో ఇలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నలు మొదలయ్యాయి. సీఎస్గా ఉన్న అధికారి పైన ఈ స్థాయిలో అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేయటం ఇదే తొలి సారి అంటూ కొందరు బ్యూరోక్రాట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఏపిలో ఈ సందిగ్దత కొనసాగుతూనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.