ఆ పథకానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు- టీడీపీ విచిత్ర డిమాండ్- ఎందుకో తెలిస్తే షాక్...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు విధానాలపై పోరాటం చేస్తున్న విపక్ష టీడీపీ... పలు సందర్భాల్లో ప్రజోపయోగ కార్యక్రమాలపై కూడా విమర్శలు చేసి అక్షింతలు వేయించుకుంది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ చేసిన మరో డిమాండ్ అధికార వైసీపీతో పాటు తోటి విపక్ష పార్టీలకు కూడా షాకిచ్చింది. ఈ డిమాండ్ పై వైసీపీ నేతలు ఒకింత షాక్ కు గురైనా ఇందుకు గల కారణాలు, గతానుభవాలు గుర్తు చేసుకుంటున్నారు.
గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ సున్నావడ్డీ పథకాన్ని అమలు చేసింది. అప్పట్లో సీఎంగా ఉన్న ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. తాజాగా ఇదే పథకానికి జగన్ సర్కారు పేరు మార్చి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణం పథకంగా అమలు చేయబోతోంది. గతంలో జగన్ తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పావలా వడ్డీ పథకం అమలు చేయగా... ఆ తర్వాత కిరణ్ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చింది.
కానీ దీన్నే ఇప్పుడు జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంగా అమలు చేస్తుండటంపై టీడీపీ అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్షంగా దీన్ని విమర్శించడంలో తప్పేమీ లేకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి పేరుతోనే అమలు చేయాలంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Recommended Video
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి జగన్ రూపంలో మరో ప్రత్యర్ధి ఉండేవారు. జగన్ ను ఎదుర్కొనేందుకు ఆయన టీడీపీ పరోక్ష మద్దతు తీసుకునేవారు. ఇదే క్రమంలో జగన్ కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెడితే దానికి టీడీపీ మద్దతిచ్చింది. దీంతో కాంగ్రెస్-టీడీపీ పరోక్ష బంధం బయటపడిందంటూ అప్పట్లో వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసేది. తాజాగా అదే కిరణ్ కుమార్ రెడ్డి పేరును జగన్ సర్కారు పథకానికి పెట్టమని టీడీపీ డిమాండ్ చేయడంతో పాత వాసనలు వదులుకోలేకపోతోందని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.