ఆన్ లైన్లో ఏపీ మండలి సమావేశాలు- రాజధాని బిల్లులు మళ్లీ పెట్టొద్దు- టీడీపీ డిమాండ్లు..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయడంతో దీనిపై విపక్ష టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కరోనా పేరుతో ప్రభుత్వం హడావిడిగా సమావేశాలు ముగించాలని చూస్తోందని మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రభుత్వం అసెంబ్లీని రెండు రోజుల్లో ముగించినా.. మండలిని మాత్రం వారం రోజుల పాటు అదీ ఆన్ లైన్లో నిర్వహించాలని యనమల కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. దీంతో యనమల ప్రతిపాదనపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.
గతంలో మండలి సెలక్ట్ కమిటీకి పంపిన రాజధాని బిల్లులను తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రేపు అసెంబ్లీలో ఈ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాక, మండలికి కూడా పంపనున్నారు. దీంతో ఈ బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఓసారి గవర్నర్ పరిధిలోకి, న్యాయస్ధానాల పరిధిలోకి వెళ్లిన బిల్లులను తిరిగి చట్టసభల్లో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ నేత యనమల స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టాలని చూస్తే తాము అడ్డుకుని తీరుతామని చెప్తున్నారు.