చంద్రబాబు, లోకేష్ ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు: ఏం జరిగినా జగన్దే బాధ్యత: కళా వెంకట్రావు
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ల భద్రతను కుదించడం పట్ల టీడీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు ఇదివరకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. చంద్రబాబు, నారా లోకేష్ల భద్రతను కుదించడం వెనుక కుట్ర ఉందని టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు.
అపాయింట్మెంట్ నిరాకరించిన అమిత్ షా: ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు: వెంకయ్య నాయుడితో భేటీ
మంగళవారం ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేష్లకు ఏమి జరిగినా దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. బుధవారం నుంచి తాము రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా తమ పార్టీ నాయకులపై దాడులు జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో- తమ పార్టీ అగ్ర నాయకత్వానికి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ప్రాణాలకు అసాంఘిక శక్తుల నుంచి పెను ముప్పు పొంచివుందని కళా వెంకట్రావు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు, మావోయిస్టులు, ఎర్ర చందనం స్మగ్లర్లు, రాజకీయ ప్రత్యర్థుల వంటి అసాంఘిక శక్తులు ఆయనపై దాడి చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఆయా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గతంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించిందని చెప్పారు.
Recommended Video
జాతీయ భద్రతా బలగాల రక్షణలో ఉన్న చంద్రబాబు భద్రతా సిబ్బందిని 146 నుంచి 67కు తగ్గించారని కళా వెంకట్రావు మండిపడ్డారు. నారా లోకేష్కు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలిసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగానే భద్రత తగ్గించిందని కళా వెంకట్రావు ఆరోపించారు. ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని..వారికి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.