కర్నూలు అడ్వొకేట్ల ఆగ్రహజ్వాల: టీడీపీ కార్యాలయం ముట్టడి: నిరసన ర్యాలీ..!
కర్నూలు: శాసన మండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ వైఖరికి నిరసనగా కర్నూలులో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడంతో పాటు న్యాయ రాజధానిగా మార్చడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం పట్ల న్యాయవాదులు, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నాయకులు భగ్గుమంటున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు.
గురువారం ఉదయం న్యాయవాదులు, రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులు సంయుక్తంగా భారీ ర్యాలీని చేపట్టారు. కర్నూలు రాజ్విహార్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ ప్రదర్శనగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినదించారు. ప్రదర్శనగా వెళ్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు.
పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ, ఇతర బ్యానర్లను న్యాయవాదులు, విద్యార్థులు చించి వేశారు. ప్రదర్శనకు బందోబస్తుగా వచ్చిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో న్యాయవాదులు, విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జీ చేయడానికి ప్రయత్నించగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ప్రదర్శనలు చేపట్టడానికి మాత్రమే అనుమతి ఉందని, ఇలా పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ ఉంటూ చూస్తూ ఊరుకోబోమని పోలీసులు హెచ్చరించారు. న్యాయవాదులు, విద్యార్థులు వారితో గొడవ పడ్డారు. తాము ఏ కారణంతో ఫ్లెక్సీని చింపాల్సి వచ్చిందో తెలియదా? అంటూ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు న్యాయవాదులు, విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.