టీడీపీలో మరో వికెట్: మాజీ ఎమ్మెల్యే గుడ్బై: చంద్రబాబు సొంత జిల్లాలో..ఆప్తుడిగా: వైసీపీ వైపు
చిత్తూరు: రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచీ వలసల బెడదను ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ. అధికారాన్ని కోల్పోయిన ఏడాది కాలంలోనే జిల్లాలకు జిల్లాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కడప, ప్రకాశం వంటి కొన్ని జిల్లాలు దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా ఉంటూ వస్తోన్న పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి వంటి నాయకులు, వారి కుమారులు, అనుచరులు గుడ్బై చెబుతున్నారు. దీనికి అడ్డుకట్ట పడట్లేదు.
ఈ సారి చంద్రబాబు సొంత జిల్లాలో..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కీలక నాయకుడు పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనే- చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచీ ఆయన కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో బలమైన కాంగ్రెస్ నాయకుడు సీకే బాబును తట్టుకుని చిత్తూరులో టీడీపీ బలపడటంలో ప్రధాన పాత్ర పోషించారు. చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీకి ఏకైక బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
2004లో అసెంబ్లీకి
ఉమ్మడి రాష్ట్రంలో 2004 నాటి ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకున్నారాయన. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేసిన ఏకే మనోహర్ ఘన విజయాన్ని సాధించారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో చేరారు. 2014 నాటి ఎన్నికల్లో మనోహర్కు టిెకెట్ దక్కలేదు. దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు భార్య సత్యప్రభను చిత్తూరు నుంచి పోటీకి దింపారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత మళ్లీ ఆయన సొంతగూటికే చేరారు. టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వైసీపీ తరఫున గెలిచిన అమర్నాథ్ రెడ్డితో కలిసి టీడీపీలో చేరారు.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పెత్తనమేనా?
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఏఎస్ మనోహర్ పోటీ చేశారు. ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు అలియాస్ ఆరణి శ్రీనివాసులు చేతిలో 39 వేల ఓట్లకు పైగా తేడాతో ఓటమి చవి చూశారు. అప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో తనకు ఆదరణ దక్కకపోవడం..జిల్లా రాజకీయాలపై మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి పెత్తనం చలాయిస్తుండటం.. చంద్రబాబు వద్ద తన మాట నెగ్గకపోవడం వంటి కారణాల వల్ల పార్టీకి గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది.
తెలుగు రైతు విభాగం అధ్యక్షుడిగా
తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు రైతు అధ్యక్షుడిగా అమర్నాథ్ రెడ్డిని నియమిస్తారంటూ జిల్లాలో కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ పదవి కోసం ఏఎస్ మనోహర్ ఆశలు పెంచుకున్నారని అంటున్నారు. తీరా ఆ స్థానాన్ని పార్టీ ఫిరాయించి వచ్చిన అమర్నాథ్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం సాగుతుండటం, దీన్ని రాష్ట్రస్థాయి నాయకులెవరూ తోసిపుచ్చకపోవడంతో మనోహర్ ఇక పార్టీలో ఉండి ఉపయోగం లేదని భావించినట్లు చెబుతున్నారు.
Recommended Video
తదుపరి అడుగులు ఎటు..
ఇక ఏఎస్ మనోహర్ రాజకీయ జీవితం ఎటు వైపు అనేది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించిన ఆయన.. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తానని అంటున్నారు. దీనికోసం తన అనుచరులతో సమావేశం అవుతానని, వారి సూచనల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. మళ్లీ వైసీపీలోనే చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైసీపీలో చేరితే కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను దక్కించుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.