వైసీపీలో చేరనున్న బాలకృష్ణ ఆప్తమిత్రుడు: ముహూర్తం చూసుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఒంగోలు: తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. కృష్ణాజిల్లా గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపులు సారించిన నేపథ్యంలో.. మరో నాయకుడు కూడా అదే బాటలో నడవడానికి సిద్ధపడ్డారు. ఆయనే కదిరి బాబూరావు. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు ఆప్తమిత్రుడు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే సమాచారం ప్రకాశం జిల్లాలో మరోసారి గుప్పు మంటున్నాయి. అధికార పార్టీలో చేరడం దాదాపు ఖాయమైందని, దీనికోసం ముహూర్తం చూసుకుంటున్నారని అంటున్నారు.
పట్టు లేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి బాబూరావు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓటమి చవి చూశారు. ఆయనకు ఏ మాత్రం పట్టు లేని నియోజకవర్గం అది. సంప్రదాయబద్ధంగా ఆయన కనిగిరి స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చేవారు. 2014 ఎన్నికల్లో ఆయన కనిగిరి నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఆయన తన స్థానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుటుంబం కోసం కనిగిరి స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
బాబూరావును కాదని శిద్ధా సుధీర్ కు టికెట్
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుకు కుమారుడు సుధీర్ కు కనిగిరి టికెట్ ను కేటాయించారు. ఇష్టం లేకపోయినా దర్శి నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు కదిరి బాబూరావు. తాను నిలబెట్టుకున్న ఓటు బ్యాంకును శిద్ధా కుటుంబానికి బదలాయించాల్సి వస్తోందని ఆయన బహిరంగంగా విమర్శించారు. దర్శి టికెట్ ఇచ్చిన సమయంలోనే..పార్టీ ఫిరాయిస్తారనే వార్తలు వచ్చాయి. అసంతృప్తిని గుర్తించిన చంద్రబాబు నాయుడు.. బాలకృష్ణను రంగంలోకి దింపారు. బాలకృష్ణ సముదాయించడంతో దర్శి అభ్యర్థిగా కొనసాగారు. చేదు ఫలితాన్ని చవి చూశారు. అప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రత్యామ్నాయంగా వైసీపీ..
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మనుగడ కొనసాగించాలంటే తెలుగుదేశంలో ఉంటే కష్టమని చాలాకాలం నుంచి కదిరి బాబూరావు భావిస్తున్నారని, పైగా జిల్లా రాజకీయాల్లో టీడీపీకి చెందిన ఒక వర్గానికి చెందిన నేతల పెత్తనం అధికమైందనే అసంతృప్తి ఆయనలో నెలకొందని అంటున్నారు. ఈ పరిణామాల మధ్య పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అన్నీ సవ్యంగా ఉంటే- మరి కొద్ది రోజుల్లో ఆయన నుంచి ఏదైనా ఓ అధికారిక ప్రకటన రావచ్చని చెబుతున్నారు.
గంటా, వల్లభనేని.. తాజాగా కదిరి
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచీ అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు పలువురిలో అసంతృప్తిగా నెలకొని ఉందనేది బహిరంగ రహస్యం. గంటా శ్రీనివాసరావు, వల్లభనేని వంశీ.. ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరడానికి సంకేతాలు పంపించారు. లేదు లేదంటూనే గంటా శ్రీనివాసరావు పార్టీని ఫిరాయించాడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవితోనూ మంతనాలు సాగించారు. ఇక వల్లభనేని వంశీ సైతం పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కదిరి బాబురావు కూడా వారితో పాటే వైసీపీలో చేరతారా? లేక మరి కొంతకాలం వేచి చూస్తారా? అనేది తేలాల్సి ఉంది.