సొంత జిల్లాలో చంద్రబాబుకు ఝలక్: మాజీ ఎమ్మెల్యే రాజీనామా: వైసీపీలో చేరిక లాంఛనమే:
చిత్తూరు: గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల తరువాత.. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వలసల బెడదను ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఘోర పరజయాన్ని చవి చూసిన తొలి ఏడాదిలోనే ఈ స్థాయిలో పార్టీ నుంచి నాయకులు వలస వెళ్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతోంది టీడీపీ అగ్ర నాయకత్వం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఆరంభంలో మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్తో ఆరంభమైన వలసలు, రాజీనామాల పర్వం కొనసాగుతూనే వస్తోంది. ఎక్కడా బ్రేక్ పడట్లేదు.
మలేరియా మందులతో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. కానీ: డొనాల్డ్ ట్రంప్ కొత్త చిట్కా..!
సొంత జిల్లాలోనే..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన సొంత జిల్లాలోనే షాక్ ఇస్తున్నారు నాయకులు. పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే ఎల్ లలితా కుమారి టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించినట్లు వెల్లడించారు. 30 సంవత్సరాలకు పైగా తాను పార్టీలో కొనసాగుతున్నప్పటికీ.. ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆమె ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో..
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తన వర్గానికి, పార్టీ జెండా మోసిన వారికి టికెట్లు ఇవ్వలేదనేది లలితా కుమారి ఆరోపణ. తాను స్వయంగా ఓ జాబితాను పార్టీ నాయకత్వానికి పంపించానని పేర్కొన్నారు. తాను పంపించిన జాబితాలో ఏ ఒక్కరికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పార్టీ కల్పించలేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఎన్నేళ్లు కొనసాగినప్పటికీ.. ఉపయోగం ఉండబోదని, కనీసం తన వర్గాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి ఎదురు కావచ్చని లలితా కుమారి వెల్లడించారు.
వైసీపీలో చేరిక లాంఛనమేనా?
తెలుగుదేశం నుంచి బయటికి వచ్చిన ప్రతి నాయకుడు కూడా ప్రత్యామ్నాయంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. లలిత కుమారి కూడా వారి బాటనే అనుసరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి బయటికి వచ్చిన తరువాత ఏ పార్టీలో చేరాలనేది తాను ఇంకా నిర్ణయించుకోలేదని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో ఆమె టచ్లో ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Recommended Video
స్థానిక సంస్థల ఎన్నికల పునఃప్రారంభమైన వెంటనే..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఆరంభం అయ్యే సమయానికి లలిత కుమారి వైఎస్ఆర్సీపీలో చేరొచ్చని అంటున్నారు. తన అనుచరులతో కలిసి ఆమె తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ తీర్థాన్ని పుచ్చుకుంటారని చెబుతున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి పోటీ చేసిన లలిత కుమారి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పూతలపట్టు నుంచి పోటీ చేశారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆమె పూతలపట్టు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.