అందులో చంద్రబాబుకు సరిలేరెవ్వరూ!: మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ హెచ్చరిక
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ మాజీ నేత, మాజీ (ఆంగ్లో ఇండియన్) ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెడుతున్న చంద్రబాబు వైఖరి అసహ్యం కలిగిస్తుందన్నారు.
చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారు..
తన ఉనికిని చాటుకోవడం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారని ఫిలిప్ సీ తోచర్ విమర్శించారు. మత రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సరిలేరని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మెడలో శిలువ వేసుకుని బైబిల్ చదువుతూ జన్మధన్యమైందని ప్రకటించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు దేవాలయాలపై జరుగుతున్న దాడులకు క్రైస్తవ సమాజాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు. ఓట్ల కోసమే చంద్రబాబు క్రైస్తవులను వాడుకుంటాడని, ఇప్పుడు అతని అసలు రంగు బయటపడటంతో రానున్న ఎన్నికల్లో క్రైస్తవ సమాజం అతనికి తగిన గుణపాఠం నేర్పుతుందని హెచ్చరించారు.
చంద్రబాబులో ఫ్రష్ట్రేషన్ పెరిగిపోయింది..
క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసినందుకు అతను తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలకు లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబుకు మతిభ్రమించిందని ఫిలిప్ తోచర్ అన్నారు. చంద్రబాబు తాను అధికారంలోకి రావడం అసంభవమని తెలిసి ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్రలుపన్నుతున్నారని మండిపడ్డారు.
అందులో చంద్రబాబు దిట్ట..
క్రైస్తవ మతంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తోచర్ ప్రకటించినట్లు తెలిపారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు తన రాజీనామా లేఖను పంపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తులను, వ్యవస్థలను వాడుకుని వదిలి వేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2014-19 వరకు ఏపీ అసెంబ్లీలో తోచర్ ఎమ్మెల్యేగా పనిచేశారు.