వైసీపీ వైపు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే: ఇక ఆ జిల్లాలో టీడీపీ గడ్డు పరిస్థితులు.!
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికే చాలామంది పార్టీకి గుడ్బై చెప్పారు. ఇతర పార్టీల్లో చేరిపోయారు. తెలుగుదేశానికి ఆర్థికంగా, రాజకీయంగా అండదండలు అందిస్తూ వచ్చిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. తాజాగా- మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి కూడా పార్టీని వీడటానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
కొత్త డెత్ వారెంట్: ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు: నిర్భయ దోషులకు ఉరి..!
వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వీరశివా రెడ్డి పోటీ చేయలేదు. ఆయన సొంత నియోజకవర్గం కమలాపురం టికెట్ను పుత్తా నరసింహా రెడ్డికి ఇచ్చింది టీడీపీ అగ్ర నాయకత్వం. అప్పటి నుంచే ఆయన అలకపాన్పు ఎక్కారు. సొంత పార్టీ అభ్యర్థిని ఓడించడానికి తనవంతు సహాయం చేశారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే రవీంద్రనాథ్ రెడ్డి.. స్వయంగా వీరశివా రెడ్డి ఇంటికి వెళ్లి, కృతజ్ఙతలు తెలపడం అప్పట్లో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అప్పటి నుంచీ వైసీపీ నేతలతోనే..
ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ వీరశివా రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఏ మాత్రం క్రియాశీలకంగా లేరు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికీ డుమ్మా కొట్టారు. అప్పట్లోనే ఆయన వైఖరిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబుకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.
ఇక అధికారికంగా..
వీరశివా రెడ్డి అధికారంగా వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయమైంది. ఎప్పుడనేది తేలాల్సి ఉంది. శనివారం కమలాపురం నియోజకవర్గం పరిధిలోని కోగటంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో వీరశివారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేతో కలిసి ఆయన బహిరంగంగా వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో వీరశివా రెడ్డి వైసీపీలో చేరనున్నట్లు రవీంద్రనాథ్ రెడ్డి ప్రకటించడం కొసమెరుపు.
పేరున్న నాయకులు కొద్దిమందే..
వీరశివా రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడమంటూ జరిగితే..పెద్ద దెబ్బే. ప్రస్తుతం తెలుగుదేశంలో కాస్త పేరున్న నాయకులను వేళ్ల మీదే లెక్క పెట్టొచ్చు. సీఎం రమేష్, మాజీమంత్రి ఆది నారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోగా.. మరో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి- ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీలో చేరారు. రాజంపేట స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. మరో మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి, పౌర సరఫరాల సంస్థ మాజీ ఛైర్మన్ లింగారెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా మధుసూదన్ యాదవ్ వంటి కొందరు నాయకులు టీడీపీ బలోపేతానికి పనిచేస్తున్నారు.