జనసేన ప్రభావం 36 సీట్లలో ! టీడీపీకే గండికొట్టిందా..? అధినేత అంచనా ఇదేనా.. ?
పోలింగ్ ముగిసింది. ఓటరు నాడి మాత్రం ఖచ్చితంగా ఎవరికీ అంతు బట్టటం లేదు. అయితే ఎవరి అంచనాల్లో వారు మాత్రం మునిగిపోయారు. ఇదే సమయంలో టిడిపి..వైసిపి గెలుపు మాదంటే మాదని చెబుతున్న వేళ..జనసేన ప్రభావం పైనా లెక్కలు తీస్తున్నారు. టిడిపి అభ్యర్దులతో పార్టీ అధినేత సమావేశమైన సమయంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనసేన కారణంగా టిడిపి నష్టపోయిందని చెప్పటం ద్వారా పార్టీ అభ్యర్దులు అవాక్కయ్యారు.
టిడిపి పైన పవన్ ఎఫెక్ట్...!
ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో టిడిపి పైన జనసేన ప్రభావం పడిందని ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లో అంగీకరిస్తోంది. పోలింగ్ జరిగిన సమయం నుండి టిడిపి..వైసిపి రెండు పార్టీల అధినేతలు విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అంతర్గతరంగా సమీక్షలు చేస్తున్నారు. తాజాగా టిడిపి నుండి పోటీ చేసిన పార్టీ అభ్యర్దులతో పార్టీ అధినేత సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు. ఆ సమీక్షల్లో పార్టీ ముఖ్య నేతలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు నేతలు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. ప్రధానంగా టిడిపి..వైసిపి మధ్య పోలింగ్ శాతం ఎలా ఉందనే అంశం పైనే ఎక్కువగా రాజకీయ విశ్లేషకులు దృష్టి పెట్టారు. అయితే, జనసేన కారణంగా టిడిపికి నష్టం జరిగిందనే విధంగా ఆ పార్టీ అధినేత వ్యాఖ్యానించారనే సమాచారంతో ప్రధానంగా గోదావరి జిల్లాల అభ్యర్దులు మరోసారి ఓలింగ్ సరళిపై సమీక్షలు ప్రారంభించారు.
36 సీట్లలో జనసేన ప్రభావం..
జనసేన తాము గెలిచే సీట్లు కాకుండా..టిడిపి బలంగా ఉన్న 36 సీట్లలో తమ ఓటు బ్యాంకు పెంచుకుందని టిడిపి నేతలు అంచనాకు వచ్చారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాన్ బలంతో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్టు సాధించిన టిడిపి..తూర్పు గోదావరిలో 13 సీట్లు దక్కించుకుంది. అయితే, ఈ సారి మాత్రం టిడిపి..పవన్ కళ్యాన్ విడివిడిగా పోటీ చేయటంతో..పవన్ అభిమానులు మొత్తంగా జనసేనకు ఓటు వేసినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోందని అంచనాకు వచ్చారు. ఇక, అదే విదంగా గోదావరి జిల్లాల్లోని బలమైన సామాజిక వర్గం అధిక శాతం ఓట్లు జనసేనకే పడ్డాయనేది విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. ఇక, విశాఖతో పాటుగా విజయనగరం జిల్లాలోనూ పవన్ ఓట్లు కొల్లగొట్టారని అది సీట్లు సంపాదించే స్థాయిలో ఉందా లేదా అనేదే ఇప్పుడ ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, తమ పార్టీకి గెలుపు ఖాయం అనుకున్న ప్రాంతాల్లో జనసేన దెబ్బ తీసిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
వైసిపి పైన ఎలాంటి ప్రభావం..
తొలి నుండి జనసేన వలన తమకు ఎటువంటి నష్టం ఉండదని వైసిపి అధినేత జగన్ చెబుతూ వచ్చారు. అదే సమయంలో టిడిపి మాత్రం జనసేన కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు లాభం చేకూరుస్తుందని అంచనా వేసారు. అయితే, పోలింగ్ పూర్తయిన తరువాత అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన కారణం గా టిడిపికి ఊహించన దాని కంటే నష్టం జరిగినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక, వైసిపి మీద ఆ ప్రభావం పడిందన్నది సర్వే సంస్థలు చెబుతున్నాయి. అయితే, అది 12 నుండి 15 సీట్ల వరకు ఉందని..గెలుపు - ఓటముల మీద ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక, ఇప్పుడు జనసేన ఎన్ని స్థానాలు గెలుస్తుంది..టిడిపి-వైసిపి ల్లో ఎవరికి ఏ మేర నష్టం చేసిందనేది తేలాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.